Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం జరిగింది. దీంతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. “చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన శ్రీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. శ్రీ రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. తమిళనాడులోని వెల్స్ విశ్వ విద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని… మరెన్నో పురస్కారాలు… మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి కలెక్టర్ మరొకటి స్టూడెంట్ చివరిగా రాజకీయ నేతగా రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు టాక్. దాదాపు ఏడాదిన్నర నుండి షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో “గేమ్ చేంజర్” విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఇటీవల బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో స్టోరీ ఉండనుందని సమాచారం. “RRR” విడుదలయ్యి రెండు సంవత్సరలు అయింది.
ఇప్పటివరకు మరో సినిమా రిలీజ్ కాలేదు. శంకర్ తో చేస్తున్న “గేమ్ చేంజర్” త్వరగా రిలీజ్ చేయాలని… అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పక్కాగా గెలిచే విధంగా పిఠాపురం నుండి పోటీకి దిగడం జరిగింది. ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో చరణ్ కి డాక్టరేట్ రావడంతో పవన్ అభినందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.