YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇవేళ ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో ఇవేళ నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ని ఇటీవల వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభ్యర్ధిత్వం కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో అధిష్టానంపై వత్తిడి చేసినా ఫలితం లేకుండా అయ్యింది.
చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జి గా నియమించిన తర్వాత మాగుంట పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ వీడతారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా, ఈవేళ ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని, తమ కుటుంబం పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తుందని తెలిపారు.
మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు గడిచాయన్నారు. ఎనిమిది సార్లు పార్లమెంట్, రెండు సార్లు అసెంబ్లీ, ఒక సారి ఎమ్మెల్సీకి పోటీ చేశామన్నారు. తమ కుటుంబానికి అహంకారం లేదనీ, ఉన్నదల్లా ఆత్మాభిమానమేనని అన్నారు. గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నామని అన్నారు. పార్టీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు.
రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తాడని ఆయన ప్రకటించారు. తనకు సీఎం జగన్మోహనరెడ్డి, పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఇప్పటి వరకూ సహాయసహకారాలు అందించారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మాగుంట ఏ పార్టీలో చేరుతున్నారనేది ప్రకటించలేదు. అయితే మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తొంది.
మాగుంట రాజీనామాతో కొద్ది రోజుల్లోనే ఆరుగురు సిట్టింగ్ ఎంపీలు వైసీపీని వీడినట్లు అయ్యింది. వీరిలో అయిదుగురు లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీని వీడారు.
YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట