YSRCP: వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊరట చెందేలా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్ సుమారు 65 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్పు చేశారు. ఇందులో కొందరు కొత్త వారు కాగా, కొందరు ఎమ్మెల్యేలను మరో నియోజకవర్గానికి పంపారు. ఇంకా ఇన్ చార్జిల మార్పునకు కసరత్తు జరుగుతుందేమో అన్న ఆందోళన కొందరు వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉంది. దీనికి తెర దించుతూ ఇవేళ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, మండల, జిల్లా స్థాయి నాయకుల సమావేశంలో జగన్ మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక పూర్తయిందని సీఎం జగన్ చెప్పేశారు. శాసనసభ, లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్ధులు దాదాపు ఖరారైనట్లేనని, చాలా స్వల్ప మార్పులు ఉంటే ఉండవచ్చని అన్నారు. మార్చాల్సినవి 99 శాతం ఇప్పటికే మార్చేశామనీ, ఇక పెద్ద మార్పులేవీ ఉండవని క్లారిటీ ఇచ్చేశారు.
45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకుని పార్టీ క్యాడర్ పని చేయాలని సూచించారు. అభ్యర్ధులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని ఐదారు సార్లు కలవాలని అన్నారు. సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టివ్ గా ఉండాలని సూచించారు. ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టిన వారే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని సీఎం జగన్ తాజాగా చేసిన ప్రకటనతో నేతలు అంతా ఒక్క సారిగా ఊపిరిపీల్చుకున్నారు.