MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభలో ఆ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాకు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇదే అంశంపై స్పీకర్ కు ఫిర్యాదు అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామ కృష్ణంరాజు పై రాజ్యాంగంలోని 10వ షెడ్యుల్ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే దీనిపై స్పీకర్ ఓం బిల్లా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరో సారి స్పీకర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందించారు.
తాను ఏ పార్టీతో జతకట్టలేదనీ, అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించాననీ, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని అన్నారు.
రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే అధారాలు సమర్పించామని వైసీపీ పేర్కొంటుండగా, రఘురామ మాత్రం తనపై అనర్హత వేటు వేయడం కుదరని చెబుతున్నారు. అనర్హత వేటు పై ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు.
కాగా ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఏపిలో టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి అనధికారికంగా వెళ్లిన ఎమ్మెల్యేల విషయం చర్చకు వస్తున్నది. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అక్కడ రఘురామ కృష్ణం రాజు పై చర్యలు తీసుకుంటే ఇక్కడ కూడా స్పీకర్ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి, ఇక్కడి స్పీకర్ లు అనర్హత పిటిషన్ లపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.