కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని సైంటిస్టులు, వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ భిన్న రకాల మాస్కులను ధరిస్తున్నారు. క్లాత్ మాస్కులు, ఎన్95 మాస్కులు, సర్జికల్ మాస్కులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరిస్తున్నారు. అయితే వీటన్నింటిలోనూ ఎన్95 మాస్కులే కరోనాను సమర్థవంతంగా అడ్డుకుంటాయని నిపుణులు తేల్చారు. ఈ మేరకు వారు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు.
ఇస్రోకు చెందిన పద్మనాభ ప్రసన్న సింహా అనే సైంటిస్టుతోపాటు కర్ణాటకలోని శ్రీ జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ సైన్సెస్ అండ్ రీసెర్చికి చెందిన ప్రసన్న సింహ మోహన రావు అనే వైద్య నిపుణుడు ఇద్దరూ కలిసి ఓ అధ్యయనం చేపట్టారు. భిన్న రకాల మాస్కులను ధరించిన వారు దగ్గినా, తుమ్మినా వెలువడే తుంపరలు గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తాయనే విషయంపై అధ్యయనాలు చేశారు. దీంతో తేలిందేమిటంటే…
సర్జికల్ మాస్కులు ధరించిన వారు దగ్గినా, తుమ్మినా వెలువడే తుంపరలు గాలిలో 0.5 మీటర్ల నుంచి 1.5 మీటర్ల వరకు ప్రయాణించాయని గుర్తించారు. అదే ఎన్95 మాస్కులు ఈ విషయంలో సమర్థవంతంగా పనిచేశాయన్నారు. ఎన్95 మాస్కులను ధరించిన వారు దగ్గినా, తుమ్మినా వెలువడే తుంపరలు గాలిలో కేవలం 0.1 నుంచి 0.25 మీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించాయని గుర్తించారు. అందువల్ల ఎన్95 మాస్కులను ధరించడం అన్ని విధాలా ఉత్తమమని, ఆ మాస్కులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా వరకు నియంత్రించవచ్చని అన్నారు.
ఇక ఎలాంటి మాస్కు లేకుండా దగ్గినా, తుమ్మినా వెలువడే తుంపరలు గాలిలో 3 మీటర్ల వరకు ప్రయాణిస్తాయని.. అందువల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్కులను కచ్చితంగా ధరించాల్సిందేనన్నారు. కాగా ఈ ఇరువురూ చేపట్టిన అధ్యయనం తాలూకు వివరాలను ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్లోనూ ప్రచురించారు.