జమ్మూ కశ్మీర్/కర్ణాటక: జమ్మూ కశ్మీర్లో ఒక నవ జంట ఓటు హక్కు విలువను చాటింది. ఉధమ్పూర్ చెందిన ఈ జంట పెళ్లి చేసుకున్న వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే ఉధమ్పూర్లోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.
ప్రస్తుతం వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొత్తగా పెళ్లయినందుకు వీరికి శుభాకాంక్షలు చెబుతూ ఓటు హక్కు వినియోగం పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధిని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆ జిల్లా ఎన్నికల అధికారి సైతం వీరిని మెచ్చుకున్నారు.
ఎన్నిపనులు ఉన్నా ఓటుహక్కును వినిగియోగించుకోవాలన్న సందేశాన్నిచ్చేందుకే ఇలా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తున్నామని నవదంపతులు తెలిపారు. మరో ఐదేళ్ల పాటు మనల్ని పాలించే నాయకుడిని ఎన్నుకుంటాం కాబట్టి ఓటు వేయడం చాలా ముఖ్యమని అన్నారు. ఒక వేళ మనం ఓటేయకపోతే ఎన్నికైన నాయకుడిని ప్రశ్నించే అధికారం కూడా కోల్పోతామని తెలిపారు. ఓటేసి దేశ అభివృద్ధికి భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు.
మరోవైపు కర్ణాటకలోనూ ఒక కొత్త పెళ్లికూతురు పోలింగ్ బూత్కు వచ్చి ఓటేశారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా సమయం ఉండటంతో పెళ్లి కూతురుగా ముస్తాబై పట్టుచీర, నగలు ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళూరు నియోజకవర్గంలోని కవూర్కు చెందిన కార్తిక గాంధీనగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కొవూర్లోని పెళ్లి మండపానికి బయలుదేరి వెళ్లారు.
రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.