ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు మరో కొత్త మలుపు తిరిగింది. ఏపీ ప్రభుత్వం ఇక పూర్తిగా ఈ ఎన్నికలను వాయిదా వేయనుందా అనే అనుమానాలు రేకెత్తించేలా చర్యలు తీసుకుంది. స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం అసలు వైసీపీ ప్రభుత్వానికి లేదని అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోవిద్ తగ్గేవరకూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తీసివేసే వరకూ ఎన్నికలు నిర్వహించేది లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.