ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడింది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అటు అధికార వైసిపి తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో తలమునకలు అవుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలు ఎవరు ఎన్ని ? సీట్లలో పోటీ చేయాలి ఎవరు ఏయే సీట్లలో పోటీ చేయాలి అనేదానిపై ఇప్పటికే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. పొత్తులోకి బిజెపి కూడా వచ్చి చేరడంతో ముందు ఒక పార్టీకి అనుకున్న సీట్లు ఇప్పుడు మారుతున్న పరిస్థితి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ స్థానాన్ని ముందుగా జనసేనకు కేటాయించాలని చంద్రబాబు అనుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద జనసేన పోటీ చేసే సీటు దర్శి అవుతుందని అనుకున్నారు. ఇక్కడ నుంచి జనసేన తరఫున గరికపాటి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పుడు దర్శి స్తానాన్ని జనసేన వదులుకుంది. బిజెపితో కుదిరిన అవగాహన మేరకు జనసేన మూడు స్థానాలను వదులుకున్న సంగతి తెలిసిందే. జనసేన వదులుకున్న మూడు స్థానాలలో దర్శి ఒకటి కావడంతో ఇక్కడి నుంచి తెలుగుదేశం తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపనుంది.
దర్శి నుంచి టిడిపి అభ్యర్థిగా ఎవరు రేసులో ? ఉంటారు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ మారిపోయాక సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన పమిడి రమేష్ కు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత ఆయన కూడా తప్పుకున్నారు. ఇక ఇప్పుడు దర్శిలో టిడిపి పోటీ చేస్తుందన్నది క్లారిటీ రావడంతో ఇక్కడ టిడిపి సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. 2014లో దర్శి నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన సిద్ధా రాఘవరావు అనుహింగా తెరమీదకి వచ్చారు.
ఆయన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తో పాటు టిడిపిలో చేరతారని సమాచారం. దర్శి నుంచి సిద్ధా రాఘవరావు లేదా ఆయన తనయుడు సుదీర్ బాబు పేరు రేసులో ఉంది. టిడిపిలో జిల్లాకే చెందిన కొందరు కీలక నాయకులు కూడా సిద్దాను పార్టీలోకి తీసుకువచ్చి దర్శిలో పోటీ చేస్తే వైశ్య సామాజిక వర్గంలో మంచి సానుకూలత ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గరటయ్య.. ఆయన కుమారుడు కృష్ణ చైతన్య కూడా దర్శి సీటు ఆశిస్తున్నారు.
కృష్ణ చైతన్యకు దర్శి సీటు ఇవ్వాలని గరటయ్య కోరుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కుటుంబానికి చెందిన డాక్టర్ లక్ష్మీ కూడా దర్శి టిడిపి రేసులకి అనూహ్యంగా దూసుకు వచ్చింది. గొట్టిపాటి రవికుమార్ పెదనాన్న అయినా గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు.. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె అయిన డాక్టర్ లక్ష్మి కూడా దర్శి టిడిపి టికెట్ రేసులోకి వచ్చారు. ఆమె భర్త డాక్టర్ లలిత్, మామ డాక్టర్ వెంకటేశ్వర్లు నరసరావుపేట టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో దర్శి టీడీపీ టిక్కెట్ ఎవరికి వస్తుందో ? చూడాలి.