ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ల హడావుడి మొదలైంది. మరీ ముఖ్యంగా అధికార వైసిపి నుంచి పలువురు కీలక నేతలు ఇతర పార్టీలలోకి వలసలు వెళ్లిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కీలక నేతలు వైసిపిని వీడి వెళుతున్నారు. పార్టీలు మారిన కొందరు నేతలకు టిడిపి, జనసేనలో టిక్కెట్లు కూడా ఖరారు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా టిడిపి, జనసేనకు బలమైన అభ్యర్థులు కొరత కొన్ని నియోజకవర్గాలలో ఉంది. దీంతో వైసిపి నుంచి రావటమే ఆలస్యం ఆ రెండు పార్టీలు వారికి వెంటనే టికెట్లు ఖరారు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీ నుంచి వచ్చిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున సీటు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. తిరుపతి అసెంబ్లీ స్థానం ఏ పార్టీకే అయినా ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో తిరుపతి సీటు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుపతి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
టిడిపి – జనసేన కొత్తలో భాగంగా ఈ టికెట్ ఎవరికీ కేటాయించాలని దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే అటు టిడిపి నుంచి.. ఇటు జనసేన నుంచి కూడా పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడంతో కొత్త చర్చకు తెరలేచింది. తిరుపతి నుంచి పొత్తులలో భాగంగా జనసేన బరిలో ఉంటుందని ఆ పార్టీ తరపున చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి శ్రీనివాసులకు ఎన్నికలలో జగన్ టిక్కెట్టు కేటాయించలేదు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి గారికి జగన్ సీటు ఇచ్చేశారు.
అందుకు బదులుగా శ్రీనివాసులను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. శ్రీనివాసులు పేరు రాజ్యసభ రేసులో బలంగా ఉంది. అయితే చివరికి వచ్చేసరికి రాజంపేటకు చెందిన రెడ్డి గారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చేసి శ్రీనివాసులకు మొండి చేయి చూపారు. అయితే ఇప్పుడు శ్రీనివాసులు వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పవన్తో భేటీ సందర్భంగా తనకు తిరుపతి టికెట్ కావాలని అడిగినట్టు తెలుస్తోంది. తిరుపతిలో తనకు ఇల్లు ఉందని.. తాను తిరుపతికి స్థానికుడిని అవుతానని పవన్ కు చెప్పినట్టు తెలిసింది.
మరీ ముఖ్యంగా శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో పాటు తిరుపతిలో బలిజి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం.. ఇటు కమ్మ సామాజిక వర్గంతో పాటు టిడిపికి ఎప్పుడు మద్దతుగా ఉండే యాదవ వర్గం ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో శ్రీనివాసులకు కలిసివచ్చేలా ఉంది. దీనికి తోడు ఆర్థికంగా కూడా ఆయన బలంగా ఉన్నారు. ఇప్పటివరకు తిరుపతిలో జనసేనకు సరైన అభ్యర్థ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ సీటు నుంచి పోటీ చేయాలా వద్దా అన్న సందేద్ధంలో పడ్డారు.
ఇప్పుడు శ్రీనివాసులు రూపంలో జనసేనకు మంచే లీడర్ దొరికాడనే చెప్పాలి. పవన్తో శ్రీనివాసులకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన 2009లో చిత్తూరు నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత వైసిపి లో చేరి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా.. 2019లో గెలుపొందారు. ఇప్పుడు జగన్ 2024 ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో ప్రత్యామ్నాయంగా జనసేన ను
చూసుకున్నారు.