తెలుగుదేశం – జనసేన పార్టీల పొత్తు సంగతి ఏమోగానీ పలు నియోజకవర్గాలలో తమకే సీటు కావాలని రెండు పార్టీల నేతలు గొడవలకు దిగుతున్నారు. మరియు ముఖ్యంగా రాజమండ్రి రూరల్ టికెట్ వివాదం రోజురోజుకు పెద్దది అవుతుంది. ఈ టిక్కెట్ ఇప్పుడు కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చుకు దారి తీసేలా కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు వర్సెస్ కమ్మ అనేలా టిడిపి – జనసేన మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తోంది. రూరల్ సీట్ కోసం టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అటు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కందుల దుర్గేష్ ఇద్దరు పోటీపడుతున్నారు.
గత ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసిన దుర్గేష్ ఏకంగా 42 వేల ఓట్లు సొంతం చేసుకున్నారు. ఇక్కడ జనసేన భారీగా ఓట్లు చీల్చడంతోనే బుచ్చయ్య చౌదరి ఏకంగా పార్టీ ఘోరంగా ఓడిపోయిన 11 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన సిట్టింగ్ సీటు వదులుకునేందుకు ఆయన అస్సలు సిద్ధంగా లేరు. పైగా చంద్రబాబుతోనే ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఏకంగా 42 వేల ఓట్లు తెచ్చుకున్న దుర్గేష్ ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ వెంట నమ్మకంగా నడుస్తూ వచ్చారు.
పవన్ కూడా దుర్గేష్కు రూరల్ సీటు ఇస్తానని ఎప్పుడో హామీ ఇచ్చారు. దుర్గేష్ కూడా రూరల్ నియోజకవర్గంలో గట్టిగా తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్యకే ఇచ్చి దుర్గేష్ను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అవ్వడమే కాదు.. ఆయనతోనూ మాట్లాడారు. దుర్గేష్ నిడదవోలు వెళతారా ? అన్నది కాసేపు పక్కన పెట్టేస్తే.. ఇక్కడ తమకు సీటు ఇవ్వకపోతే టీడీపీ క్యాండెట్ బుచ్చయ్యకు సహకరించేదే లేదని నియోజకవర్గంలో కాపులు మాత్రమే కాదు.. తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది కాపులు చర్చించుకుంటోన్న పరిస్థితి.
చంద్రబాబు తణుకు నియోజకవర్గంలో కమ్మ వర్గానికే చెందిన విడివాడ రామచంద్రరావు బలమైన పోటీదారుగా ఉన్నా కూడా తన పార్టీకే చెందిన కమ్మ నేత ఆరిమిల్లి రాధాకృష్ణకు ఫస్ట్ లిస్టులోనే సీటు కేటాయించుకున్నారని.. కనీసం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తమ పార్టీకి బలమైన కాపు నేతగా ఉన్న మంచి వ్యక్తి దుర్గేష్కు సీటు ఇవ్వకుండా.. ఇక్కడ కూడా తన సామాజిక వర్గానికే చెందిన బుచ్చయ్య చౌదరికే సీటు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
అయితే టీడీపీ వెర్షన్ మరోలా ఉంది. ఇప్పటికే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న రాజానగరం సీటు వదులుకున్నామని.. అక్కడ నుంచి జనసేన తరపున కాపు వర్గానికే చెందిన బుత్తుల బలరామకృష్ణ పోటీలో ఉన్నారని.. ఆ పక్క సీటు రాజమండ్రి రూరల్ జనసేనకు ఇచ్చి.. అక్కడ కూడా కాపు వర్గానికే చెందిన దుర్గేష్కు సీటు ఇస్తే తమకు ఇబ్బందులు తప్పవన్నది టీడీపీ వెర్షన్. రాజానగరంలో కమ్మ వర్గానికే చెందిన ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణను పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు రూరల్లో కూడా కమ్మ వర్గానికే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్యను పక్కన పెట్టేందుకు ఇష్టపడడం లేదు. ఈ ఈక్వేషన్ల సంగతేమో గాని రూరల్ సీటు కమ్మ వర్సెస్ కాపుల మధ్య గోడలా మారింది.