ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ విషయంలో ఆయనకు పోలిక మొదలైంది.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్ల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ధైర్యం ప్రస్తావనకు వస్తోంది.
హరీశ్ రావు సంచలన కామెంట్లు
జీఎస్టీపై పదిరాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ‘జీఎస్టీ బకాయిలు కేంద్రం చెల్లించాల్సిందే. కరోనా సాకుతో లక్షా 35 వేల కోట్లు ఎగ్గొట్టాలని కేంద్ర చూస్తోంది. మూడు లక్షల కోట్ల జిఎస్టీ బకాయిలను లక్షా 65వేల కోట్లకు తగ్గించడం దారుణం. ఆదాయం మిగిలితే తీసుకుంటాం.. తగ్గితే అప్పు తెచ్చుకోండి అన్న తీరుగా కేంద్రం వ్యవహరిస్తోంది.` అని మండిపడ్డారు.
పోరాటం చేస్తాం…నిలదీస్తాం
“4 నెలల్లో తెలంగాణ రాష్ట్రం రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన సెస్సును ఎగ్గొట్టాలని చూస్తోంది. రాష్ట్రాల హక్కును ఎన్డీయే, యూపిఎ కాలరాశాయి. జిఎస్టీలో చేరకపోతే తెలంగాణకు రూ.25వేల కోట్లు అదనంగా వచ్చేవి. అయినా దేశం ప్రయోజనాల కోసం జిఎస్టీలో చేరాం.జిఎస్టీ అమలును చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి.రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ బకాయిల కోసం న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం’ అని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు ఈటల… ఇప్పుడు హరీశ్ రావు
గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణకు రావాల్సింది ఇవ్వలేదని, మీరు కూడా ఇవ్వరా అని జీఎస్టీ చట్టం చేసిన సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ప్రశ్నించారని ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. “జీఎస్టీ సమావేశాలలో అరుణ్ జైట్లీ అదేం లేదంటూ అందరికి న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి కాలరాస్తున్నారని ఈటెల మండిపడ్డారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్ని వారి ఆధీనంలోకి తీసుకుంటుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పారు` అని గుర్తు చేశారు.
జగన్ ఏం చేస్తారో?
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు సహజంగానే తెరమీదకు వస్తోంది. తెలంగాణ వలే ఆయన సైతం పోరాటం చేస్తారా? లేదా పరతిపాదనల వరకే పరిమితం అవుతారా అంటూ పలువురు ఆసక్తిగా విశ్లేషిస్తున్నారు.