ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటన విడుదల చేసింది. 11వ తేదీ శుక్రవారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ ప్రత్యేక విమానంలో కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరులోని విధాన సౌధలోని కనకదాసు, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. తుదపరి కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్సన్ రైళ్లకు ప్రధాని మోడీ జండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ – 2 ను పీఎం మోడీ ప్రారంభిస్తారు. తదనంతరం 108 అడుగుల కెంపె గౌడ కాంశ్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. అనంతరం 12.30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో పీఎం మోడీ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత తమిళనాడులోని దిండిగల్ లో గాంధీ గ్రామ్ రూరల్ ఇన్ స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని 2018-19, 2019- 2020 బ్యాచ్ లకు చెందిన విద్యార్ధులకు కాన్వోకేషన్ డిగ్రీలను ప్రధానం చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఏపిలోని విశాఖకు చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేస్తారు. 12వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ నవీకరణ, ఈస్ట్ కోస్ట్ జోన్ పరిపాలనా భవన సముదాయానికి పీఎం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్ వర్క్ షాపు, రూ.26 కోట్లతో చేపట్టిన హెచ్ పీ సీఎల్ నవీకరణ, విస్తరణ పనులు, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలనా భవనానికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అంతే కాకుండా రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపల రేవు నవీకరణ ప్రాజెక్టు , రూ.560 కోట్లతో కాన్వెంట్ కూడలి నుండి షీలానగర్ వరకూ పోర్టు రహదారికి పీఎం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంలో విశాఖలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పీఎం మోడీతో పాటు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొననున్నారు.
విశాఖ పర్యటన అనంతరం తెలంగాణలోని రామగుండంలో ఉన్న ఆర్ ఎఫ్ సీ ఎల్ ప్లాంట్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4.15 గంటలకు రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ట్విస్ట్ ఏమిటంటే.. ఏపిలో మోడీ పర్యటనను అధికార వైసీపీ సర్కార్ స్వాగతిస్తొంది. విశాఖలో ప్రభుత్వం ఆధ్వర్యంలో బహిరంగ ఏర్పాట్లు జరిగాయి. వైసీపీ ముఖ్య నేతలు మోడీ బహిరంగ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమం కావడంతో ఎవరూ రాజకీయం చేయవద్దని ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ నేతలను ఉద్దేశించి కోరారు. ఏపిలో ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం ప్రధాని పర్యటనను రాజకీయం చేయవద్దని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పీఎం మోడీ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసిఆర్ పాల్గొనే అవకాశం లేదు. తెలంగాణలో మోడీ పర్యటన విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర కమిటీ సన్నాహాలు చేస్తొంది. తెలంగాణలో పీఎం మోడీ పర్యటనలో నిరసనలు వ్యక్తం చేయడానికి టీఆర్ఎస్ సిద్దమవుతోంది.
Breaking: లిక్కర్ స్కామ్ కేసులో వారిని వారం రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి