ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2న నిర్వహించతలపెట్టిన పీస్ ర్యాలీకి కేసిఆర్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఆయన అమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణను దోచుకున్నది చాలక కేసిఆర్, ఆయన కుటుంబం దేశం మీద పడుతున్నదని పాల్ ఆరోపించారు. కేసిఆర్ లాంటి దుర్మార్ఘమైన వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు.
పీస్ ర్యాలీకు ప్రముఖులు వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేవనీ కానీ ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతిపిత అయితే ఈయన రాష్ట్రానికి పిత అట.. కేసిఆర్ కు సిగ్గు ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా కేసిఆర్ కు బానిసలుగా మారారని విమర్శించారు కేఏ పాల్. కేసిఆర్ సర్కార్ తీరుకు నిరసనగానే తాను ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇదే సందర్భంలో మునుగోడు ఉప ఎన్నిక పైనా మాట్లాడారు కేఏ పాల్, మునుగోడు ప్రజలు ఆటోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. 1200 మంది అమరవీరుల ప్రాణ త్యాగంతో వచ్చిన తెలంగాణలో కేసిఆర్ కుటుంబం తప్ప మరెవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పిన కేసిఆర్ దరిద్ర తెలంగాణ చేశారని విమర్శించారు. మనుగోడు ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని కోరారు కేఏ పాల్. విజయదశమి నాడు కేసిఆర్ జాతీయ పార్టీ ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ పార్టీ ఆరంభిస్తుండటంపై అటు కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేఏ పాల్ కూడా కేసిఆర్ జాతీయ పార్టీపై విమర్శలు చేశారు.