ఇది ఎవరూ ఊహించని విషయం.. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది! అబ్బా… మళ్లీ ఏమైంది అని ఇప్పటికే పేర్లు నమోదు అయినవారు అనుకుంటుంటే… హమ్మయ్య వాయిదా పడింది, మా పేర్లు కూడా యాడ్ అవుతాయిలే అని సంబరాలు చేసుకుంటున్నారు ఇంకొందరు. జూలై 8న అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జగన్.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు అర్హులైన గ్రామీణ, పట్టణ ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉన్నట్లుండి వాయిదా వేశారు!
దీనికి గల కారణం ఎవరు అనే సంగతి కాసేపు పక్కనపెడితే… కారణం ఏమిటి అనే విషయం మాత్రం సుస్పష్టం. అదే కోర్టులో ఉన్న కేసులు!! అవును… సుప్రీంకోర్టులో కేసుల ఉన్న కారణంగానే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తుంది! దీంతో ఆ సమస్యలు, ఆ లీగల్ వ్యవహారాలు అన్నీ క్లియర్ చేసుకున్న అనంతరం, అన్నీ అనుకూలంగా జరిగితే ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించిందంట ఏపీ ప్రభుత్వం.
కాగా… ఇళ్ల స్థాలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి జరిగిన భూ సేకరణలో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతిని ఎత్తిచూపుతూ సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ విషయంలో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను అర్హులకు ఇవ్వడం లేదని, ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్న సంగతి తెలిసిందే!