పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అనుకున్న తరుణంలో “లేదు వెళ్లట్లేదు, దుష్ప్రచారం చేసారు” అంటూ చెప్పారు. ఈ దశలో యూటర్న్ తీసుకోవడం ప్రకాశం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుండి వరుసగా రెండు సార్లు గెలిచిన ఏలూరి సాంబశివరావు ఆ జిల్లాలో టిడిపి ముఖ్యుల్లో ఒకరు. నియోజకవర్గంలో పార్టీ పతనావస్థలో ఉన్న దశలో… దగ్గుబాటి రాజ్యమేలుతున్న దశలో 2012 లో పార్టీ జెండాని నిలబెట్టిన ఘనత ఏలూరిదే. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కంటే లోకేష్ తో ఏలూరి చనువు ఎక్కువగా ఉంది.
పార్టీలో ప్రాధాన్యత ఇలా…!
ఏలూరి సాంబశివరావు పార్టీలోకి ప్రవేశం.., ఎదుగుదల మొత్తం దగ్గరుండి చేసుకున్నది నాటి టిడిపి పెద్దలు నామా నాగేశ్వరరా, సుజనా చౌదరి. ప్రస్తుత టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ, నామా నాగేశ్వరరావు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఏలూరి సాంబశివరావును పర్చూరుకు పంపారు. ఏలూరి కూడా 2018 నవంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో నామా తరపున కీలకంగా పని చేసారు. అలాగే ఇప్పుడు బీజేపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కూడా ఏలూరి చాలా దగ్గరి వాడు. ప్రకాశం జిల్లా విషయానికొస్తే ఆయన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ అనుచరుడు. ఇలా ఏలూరి పార్టీలో కీలక వ్యక్తుల ద్వారా ప్రవేశం చేసి, రెండు సార్లు గెలిచి సొంత క్యాడర్ ఏర్పరుచుకుని, స్థిరమయ్యారు.
చీరాల నేర్పిన అనుభవమేమో…!
పక్క నియోజకవర్గం చీరాల రాజకీయ ప్రభావం ఏలూరిపై బాగానే పడినట్లుందని జిల్లాలో టాక్ నడుస్తుంది. చీరాల ఎమ్మెల్యే బలరామ్ వైసిపిలో చేరాక ఏలూరి కూడా సైకిల్ దిగాలని నిర్ణయించుకున్నారని ఒక సమాచారం. ఈ విషయంలో వైసీపీ అధిష్ఠానంతో ఒక దశలో చర్చలు కూడా జరిగాయని బోగట్టా. ఇదే సమయంలో టిడిపి హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది. వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, కరణం బలరామ్ లాగా ఇంకో నలుగురైదుగురు టిడిపి ఎమ్మెల్యేలు కనుక వైసీపీలో చేరితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు తమదైన శైలిలో ఏలూరికి నచ్చజెప్పారని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఏలూరికేమైనా ఆర్థిక అవసరాలు ఉంటే అవి కూడా తీరుస్తామని టిడిపి అధిష్ఠానం హామీ ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీలో చేరిన కరణం బలరామ్ కంఫర్ట్బుల్గా లేకపోవటం కూడా ఏలూరి గమనించారు. చీరాల్లో ఇప్పటికే ఉన్న పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆమంచిని కాదని కరణం బలరామ్కు పూర్తిస్థాయి పెత్తనమిచే యోచనలో వైసీపీ అధిష్ఠానం లేదు. బలరామ్ వైసీపీలో చేరినా ఆయనకేమి ఒరిగిందేమీ లేదని ఏలూరి అర్ధం చేసుకున్నారన్నారు. ఇలాగే పర్చూరులో కూడా ఇప్పటికే వైసిపి ఇంఛార్జీగా రావి రామనాథం బాబు ఉన్నారు. తాను వైసీపీలో చేరినా పర్చూరు పగ్గాలు తనకేమీ అందే సూచనలు లేవని ఏలూరి గ్రహించారు. ఈ పరిస్థితుల్లో టిడిపిలో ఉండడమే శ్రేయస్కరమని ఆ పార్టీలో అయితే తాను మోనార్క్ లాగ ఉంటానని ఏలూరి ఒక నిర్ణయానికి వచ్చారు.అంతేగాక జగన్ పార్టీలో సామాజిక పరమైన ఇబ్బందులు కూడా ఉంటాయని బాగా ఆలోచించిన ఏలూరి వైసిపిలో చేరే యోచనను విరమించుకున్నానని తెలుస్తుంది. దీంతో వైసీపీ వర్గాలు డీలా పడగా టిడిపికి జోష్ వచ్చింది.