Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కాంగ్రెస్ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ప్రత్యేక శైలిలో ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు.ఎవరిని అయితే ఆయన టార్గెట్ చేస్తారో వారిమీద విభిన్న శైలిలో విరుచుకుపడుతుంటారు.గతంలో ఫామ్హౌస్ వివాదంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నే ఆయన ఒక ఆట ఆడుకున్నారు.రకరకాల ఆరోపణలతో కేటీఆర్ ని ఇరుకున పెట్టారు.తాజాగా ఆయన మంత్రి జగదీశ్ రెడ్డి,మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు.వారిని ఉద్దేశించి రేవంత్ చేసిన ట్వీట్ తెలంగాణాలో సంచలనం రేపుతోంది.తన ట్వీట్ కి ఆధారంగా కొన్ని ఆంగ్ల దిన పత్రికల కథనాలను కూడా రేవంత్ జత చేశారు.
Revanth Reddy: ఆ ట్వీట్ ఏమిటంటే?
రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…? అంటూ రేవంత్ ట్వీట్ సాగింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ ఆయన ఈ ట్వీట్ చేసినట్టుగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అంటున్నారు.
ఆ ట్వీట్ వెనక కథా కమామిషు!
గత జనవరిలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుమారుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా హంపీలో నిర్వహించారు. ఈ బర్త్ డే వేడుకలకు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఆ సందర్భంగా పలు రాజకీయ చర్చలు చోటుచేసుకున్నాయని ముఖ్యంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడంపై ప్రధానంగా మాట్లాడుకున్నారని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం రాసింది.అంతేగాక అప్పుడే ఈటెల వ్యవహారశైలిపై కూడా వారి మధ్య చర్చ జరిగిందని అందులో పేర్కొన్నారు.ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ ఈ ట్వీట్ చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.కాగా తాజా రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా కినుకతో ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనం లో ఉంది.ఈసారి జగదీశ్ రెడ్డిపై వేటు పడవచ్చు అన్నట్లుగా ఆ కథనం సాగింది. దీన్నే రేవంత్ రెడ్డి తన ట్వీట్లో తనదైన శైలిలో చెప్పారంటున్నారు.ప్రస్తుతానికైతే తెలంగాణలో ఇదే హాట్ టాపిక్.