రంగారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం మల్కాపురం గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ తాడ్బండ్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది కర్నాటక లోని గుర్మిత్కల్ గ్రామానికి కారులో బయలుదేరి వెళుతుండగా చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గేటు సమీపంలో రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని వీరి వాహనం ఢీకట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో అసిఫ్ఖాన్ (50), సానియా (18), హర్ష (28), నజియా భాను (36), నజియా బేగం (45) హర్ష భాను (6)లు మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్, ఆలీబేగంలు తీవ్రంగా గాయపడగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయలైన నౌషీర్, అన్వర్ ఖాన్లను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసు సిబ్బంది వాహనాలను ట్రాఫిక్ను క్రమబద్దీకరించి వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.