YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన అన్న జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
జగనన్నా, జగనన్నా అంటూనే ..
జగనన్నా, జగనన్నా అంటూనే ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. షర్మిల జిల్లా పర్యటనల్లోనూ భారీగా జనాలు వస్తున్నారు. వైఎస్ జగన్ పై షర్మిల విమర్శలు చేస్తుంటే, వైసీపీ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
సెక్యురిటపై డీజీపీకి లేఖ
మరో పక్క గతంలో ఆమెకు సెక్యురిటీగా 4+4 సెక్యురిటీ సిబ్బంది ఉండగా, తొలుత 2+2 ఆ తర్వాత 1+1కు కుదించారు. సెక్యురిటీ తగ్గించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తనకు భద్రతా సిబ్బందిని పెంచాలని కోరుతూ షర్మిల డీజీపీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా డీజీపీకి లేఖ రాశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో ఇటీవల వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నా చెడు కోరుతున్నట్లే కదా..
ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదంటే తనకు చెడు కోరుకున్నట్లే కదా అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భద్రత పెంపు కోరుతూ పోలీసులకు ధరఖాస్తు చేసుకోవాలని ఆమెకు పోలీసు వర్గాలు సూచించినట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆమె అధికారికంగా కోరడంతో వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సెక్యురిటీ 2+2కు పెంపు
వైఎస్ షర్మిల అభ్యర్ధన మేరకు ప్రస్తుతం ఉన్న 1 +1 నుండి 2+2 భద్రత పెంచామని తెలిపారు. షర్మిల అభ్యర్ధన మేరకు డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లుగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు ఇలా పెంచినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లు కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫార్సు (సెక్యురిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయిస్తామని ఎస్పీ వెల్లడించారు.
TDP Janasena: గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్ధులు వీరే..?