టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల ఖరారు అంశం.. ఇరు పార్టీలకు కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు తెస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒకరికి మాటివ్వడం.. అదేస్థానాన్ని టీడీపీ అదినేత చంద్రబాబు మరొకరి ఇస్తానని చెప్పడం.. ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఉదాహరణకు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో రాజకీయ వివాదం చెలరేగింది. ఇక్కడి టికెట్ను చంద్రబాబు పార్టీ యువ నాయకుడు.. కాగిత కృష్ణ ప్రసాద్కు ఇస్తానని.. ఇటీవల మాటిచ్చారు.
దీంతో కృష్ణ ప్రసాద్ వర్గం సంబరాలు చేసుకుంటోంది. అంతేకాదు.. పెద్ద ఎత్తున కటౌట్లు కూడా వెలిశా యి. టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన కృష్ణ ప్రసాద్ గట్టి పోటీ ఇచ్చి ప్రస్తుత మంత్రి జోగి రమేష్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు . కానీ, ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ నాయకుడు.. ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బాలశౌరి కుమారుడు అభినయ్కు ఇస్తామని మాట ఇచ్చినట్టు ఈ వర్గం చెబుతోంది.
అంతేకాదు.. రెండు టికెట్లు ఇస్తామని చెప్పినందుకే.. తాము పార్టీ మారామని.. అభినయ్ తన వర్గంతో చెబుతున్నారు. దీంతో అభినయ్ ఫ్లెక్సీలు కూడా పెడనలో కనిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఈ టికెట్పై పవన్ మాట ఇచ్చి ఉన్నారనే ప్రచారం జరుగుతున్న దరిమిలా.. ఈ విషయంపై తేల్చుకునేందుకు హుటాహుటిన బుధవారం కాగిత నేరుగా చంద్రబాబును కలిసి.. ఏదో ఒకటి తేల్చేయాలని పట్టుబట్టారు. దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు ఆయన తెలిపారు. టికెట్ నీకే.. జాగ్రత్తగా ప్రచారం చేసుకోమని చంద్రబాబు అభయం ఇచ్చారని అంటున్నారు.
ఈ పరిణామాలతో పెడన నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య పోటా పోటీ రాజకీయాలు సాగుతున్నాయి. పైగా కాగిత కృష్ణ ప్రసాద్ బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ నుంచి గత 30 ఏళ్లుగా ఆయన తండ్రి టీడీపీలో ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని ఉన్నారు. అటు బాలశౌరి కాపు వర్గం నేత. ఇక్కడ బీసీ నేతను కాదని జనసేన నుంచి తండ్రి, కొడుకులు ఇద్దరూ పోటీ చేస్తే బీసీల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇది అంతిమంగా పొత్తు చిత్తయ్యేలా ఉంటుంది.
ఇక ఇప్పుడు నియోజసకవర్గంలో ఇరు పార్టీల నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పెడన నియోజకవర్గంలో ఎవరికి వారు ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి దీనిపై ఏదో ఒకటి తేలుస్తారా? లేక.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పార్టీల నాయకులు ఎదురు చూస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ఇలా ఒక పార్టీ మాట, మరో పార్టీ టికెట్ హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.