ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన పార్లమెంటు స్థానం నరసరావుపేట. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడనుంచి ఎవరు గెలుస్తారు ? అనేది ఆసక్తిగా మారింది. ఎవరికి మెజారిటీ ఉంది ? అనేది ప్రశ్నగా మారింది. వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ సారి ఇక్కడ ప్రయోగాత్మకంగా బీసీకి టికెట్ ఎనౌన్స్ చేశారు. మరోవైపు.. వైసీపీ నుంచి రేపో మాపో.. టీడీపీలోకి వెళ్తారని ప్రచారం ఉన్న సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు పోటీకి దిగడం దాదాపు ఖరారైంది. ఇదే జరిగితే ఎంతో ప్రతిష్టాత్మకమైన నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో కమ్మ వర్సెస్ బీసీ మధ్య తొలిసారి సమరం జరగనుంది.
పేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. 1983 నుంచి అంటే.. టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి కమ్మ లేదా రెడ్డి సామాజికవర్గాలకు టికెట్ ఇస్తూ వస్తోంది. ఇక, కాంగ్రెస్, లేదా.. వైసీపీ తరఫున ఇక్కడ నుంచి రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా కమ్మలకు అవకాశం ఇస్తోంది. కానీ, తొలిసారి వైసీపీ ఈ టికెట్ను బీసీ నాయకుడు, మాజీ మంత్రిఫైర్ బ్రాండ్ అనిల్కుమార్ యాదవ్కు కేటాయించింది. బీసీలు ఎక్కువగా ఉన్నారన్న అంచనాతోనే ఆయనకు టికెట్ ఇచ్చినట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎవరు ?ఇక్కడ నుంచి గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.
పార్టీల బలాలు..
పార్టీలపరంగా చూసుకుంటే.. వైసీపీ గత ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఎంపీగా గెలిచిన లావు శ్రీకౄష్ణ దేవరాయులు ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇది పార్టీపరంగా తమకు ప్రయోజనం కలిగిస్తుందని వైసీపీ చెబుతోంది. కానీ, ఇది వ్యక్తిగత ఖాతాలోకే పడిందని.. తాను చేసిన అభివృద్ధి అంతా.. ఎంపీ నిధుల నుంచే చేశానని లావు చెబుతున్నారు. దీంతో అభివృద్ది మంత్రం .. మొత్తం ఆయనకు అనుకూలంగానే ఉండనుంది. పైగా వివాద రహితుడు కావడం గమనార్హం. టీడీపీకి కూడా బలమైన కంచుకోటలు ఉన్నాయి. వినుకొండ, గురజాల, చిలకలూరిపేట, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకర్గాల్లో బలమైన కేడర్ ఉంది. ఇది ఇప్పుడు కలిసి రానుంది. పైగా.. రాజధాని ఎఫెక్ట్ పార్టీకి అనుకూలంగా ఉంది.
వ్యక్తుల పరంగా…
వ్యక్తుల పరంగా చూస్తే.. ఎక్కడి నుంచో వచ్చి(నెల్లూరు) ఇక్కడ పోటీ చేసేందుకు అనిల్ సిద్ధమయ్యారు. కేవలం బీసీ ట్యాగ్ తప్ప.. ఆయనకు నియోజకవర్గంపైనా, సమస్యలపైనా అవగాహన లేదనే చెప్పాలి. దీంతో ఆయనను ప్రజలు ఎంత వరకు హర్షిస్తారనేది చూడాలి. పైగా.. వివాదాలకు ఆయన కేంద్రంగా నిలుస్తారు. సొంత పార్టీలోను.. సొంత కుటుంబంలోనూ ఆయనకు కుంపట్లు ఉన్నాయి. ఇది నరసరావు పేట ప్రజలకు ఇబ్బందిగానే ఉంటుంది. వివాద రహితంగా లావును వారు అక్కున చేర్చుకున్నారు. దీనికితోడు.. వైసీపీ అంతర్గత కుమ్ములాటలు.. రాజధాని ఎఫెక్ట్ అనిల్పై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది. పోటీ బలంగానే ఉన్నప్పటికీ.. గెలుపుపై మాత్రం ఆయనకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదైనా విచిత్రం జరిగితేనే తప్ప.. అనిల్ గెలుపును ఊహించే పరిస్థితి లేదు.
ఇక, లావు విషయానికి వస్తే.. ఆయన స్థానికుడు. పైగా సిట్టింగ్ ఎంపీ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వరికపూడి శెల.. వంటి ప్రాజెక్టుకు ఆయన ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించారు. దీనికి తోడు.. వివాద రహితంగా.. అందరినీ కలుపుకొని పోయారు. వైసీపీ ఎమ్మెల్యేలే ఆయనకు జై కొట్టారంటే.. పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పైగా.. అందరికీ అందుబాటులో ఉండడంతోపాటు.. అమరావతికి పరోక్షంగా(వైసీపీలో ఉన్నప్పుడు) జై కొట్టారు. సో.. ఈ పరిణామాలకు ఆయనకు బలంగా కలిసిరానున్నాయి. దీంతో లావుకు సానుకూలతలు కాస్త ఎక్కువ ఉన్నా… పోటీ మాత్రం హోరాహోరీగానే ఉండనుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!