CAA: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవేళ (మంగళవారం) విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని ఆదేశించిన ధర్మాసనం .. తదుపరి విచారణకు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ల పై విచారణ పూర్తి అయ్యే వరకూ సీఏఏ నిబంధనలపై స్టే విధించవద్దని తుషార్ మెహతా కోరారు. వీటిపై పూర్తిగా స్పందించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై పలు వర్గాలు నిరసనలు తెలుపుతున్నాయి. కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల వేళ వివాదాస్పద చట్టం అమలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మతం ఆధారంగా సీఏఏ అమలు చేస్తున్నారనీ, ప్రత్యేకించి ముస్లింలపై వివక్ష చూపుతుందనీ ఇతర పిటిషనర్లు పేర్కొన్నారు.
మతపర విభజన వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించడం అవుతోందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సంఘాలతో పాటు టీఎంసీ నేత ముహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసొం కాంగ్రెస్ నేత దేబబ్రద సైకియా, ఎన్జీవో రిహయ్ మంచ్ తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత