అమరావతి: జగన్ రెండు నెలల పాలన అంతా కమిటీలు, కమిషన్లేనంటూ టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. వైసిపి నేతలు గాలిలో తిరుగుతూ భూమిపై సమస్యలు పట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శించారు. వరదల వల్ల గోదావరి జిల్లాలో 50వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని లోకేష్ అన్నారు. బాధితులకు ఎకరాకు పదివేల వంతున సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకారులను ఆదుకోవాలని లోకేష్ కోరారు.
టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి నేతల ప్రతినిధి బృందం పర్యటిస్తున్నది. ఎమ్మెల్సీ నారా లోకేష్ నేతృత్వంలో టిడిపి బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మొదటి రోజు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గంలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆచంట నియోజకవర్గం మార్టేరు, కోడేరు, ఆచంట. వేమవరం, గుమ్ములూరు, పాలకొల్లు నియోజకవర్గంలోని వర్దిపర్రు, కాంబోట్లపాలెం, గుంపర్రు తదితర గ్రామాల్లో వీరు పర్యటించారు.
ఈ సందర్భంలో జగన్ ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
లోకేష్ బృందం ఈ రాత్రి రాజమహేంద్రవరంలో బసచేసి గురువారం ఉదయం దేవీపట్నం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు.