ఉమ్మడి శ్రీకాకుళంలోని ఆమదాలవలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కూన రవికుమార్ కు టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత.. అనూహ్యమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ పోరు ఏకపక్షమనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. కూనకే మా ఓటు. మాకు ఆయన అండగా ఉన్నారు అనే టాక్ జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. పైగా.. తమ్మినేనికి వ్యతిరేకత పెరిగిపోయిందని తాజాగా నిర్వహించిన సర్వేలోనూ వెల్లడైంది. దీంతో వైసీపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇస్తే..ఆయన ఓటమిని చవిచూడడం ఖాయమని వైసీపీ నాయకులుకూడా చెబుతున్నారు.
అలాగని ఇవ్వకపోతే.. బీసీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని వైసీపీలో మరో చర్చ సాగుతోంది. దీంతో ఈ సీటు విషయంపై ఎటూ తేలలేదు. అయితే.. తమ్మినేని మాత్రం తనకుటుంబానికేనని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ దఫా తన తనయుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ, వైసీపీ అధినేత దానికిఒప్పుకోలేదు. ఈ క్రమంలో తమ్మినేని పోటీ అనివార్యంగా మారింది. ఇక, బలాబలాల పరంగా చూస్తే.. 2014 ఎన్నికల్లో కూన రవికుమార్ తొలిసారి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
2019ఎన్నికల్లో ఓటమి పాలయిన రవికుమార్ ప్రజలకు చేరువ అయ్యారు. వారి దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారు. ఇదే ఆయనకు 2024లోనూ టిడీపీ టికెట్ దక్కేలా చేసింది. వాస్తవానికి ఈ నియోజకవర్గానికి పది సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ విజయం సాధించింది. అంటే.. ఒకరకంగా టీడీపీకి ఆముదాల వలస కంచుకోట. ఈ క్రమానికి తోడు.. గత ఎన్నికల్లో కూన ఓడిపోయారన్న సింపతీ పవనాలు జోరుగా వీస్తున్నాయి.
ఈ సింపతీ పవనాలకు తోడు.. సీతారాం వ్యవహార శైలి.. ఆయనదూకుడు వంటివి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అంటున్నారు. మరోవైపు.. ఎలాంటి అభివృద్ధి లేకపోవడం.. కూనపైనే కేసులు పెట్టినా.. ఖండించలేదన్న వాదన వంటివి సీతారాం రాజకీయాలకు మైనస్గామారాయి. అంతేకాదు, తాను అనేక సార్లు కోరినామంత్రి పదవి ఇవ్వకపోవడం.. కూడా సీతారాం వర్గంలో అసంతృప్తిగా ఉంది. ఈ సారి కూన గెలిస్తే.. ఖచ్చితంగా చంద్రబాబు ఆయనకు మంత్రిపదవి ఇస్తారనే అండర్ కరెంట్ ప్రచారం పుంజుకుంది. దీంతో ఆముదాల వలసలో సీతారాం రాజకీయాలు ఈ సారి తలకిందులు కావడంఖాయమనే చర్చ జరుగుతోంది.