టీమిండియా క్రీడాకారులు భారతీయ సైన్యానికి ఒక విభిన్నమైన రీతిలో సెల్యూట్ చేస్తున్నారు. రాంచీలో ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మూడో వన్డే మ్యాచ్ లో ప్రత్యేకంగా ఆర్మీ హ్యాట్లు ధరించి మైదానంలోకి దూకనున్నారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో తెలిపింది. సైనికుల గౌరవార్ధం ఇలా చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు జట్టులోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ చెప్పింది. అయితే ఈ సలహా ఇచ్చింది మరెవరో కాదు.. సాక్షాత్తు టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీయే!! తన స్వస్థలమైన రాంచీలోనే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో మహీ ఈ ఆలోచనను ప్రతిపాదించగా అందుకు బీసీసీఐ కూడా పచ్చజెండా ఊపినట్లుంది. కానీ ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు.
పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించినపుడు, అలాగే పాకిస్థాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో గల ఉగ్రవాద శిబిరాల మీద భారత వైమానిక దళం దాడులు చేసినపుడు కూడా మన సైన్యానికి టీమిండియా క్రికెటర్లు సెల్యూట్ చేశారు. ‘‘బ్రేవో ఇండియన్ ఎయిర్ ఫోర్స్! ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కావల్సిన సందేశాన్ని వాళ్లు పంపారు. మీరంటే మాకెంతో గర్వంగా ఉంది. జై హింద్!’’ అని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే ట్వీట్ చేశాడు.