Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల హడావుడి మోదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. పోటాపోటీగా టీడీపీ అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నామినేషన్లు వేయడానికి కూడా టీడీపీ నేతలు వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందీ, దీంతో వైసీపీకి ఏకగ్రీవాలు అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం కాస్త ధైర్యంగా, అభద్రతాభావాన్ని వదులుకొని నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వైసీపీ గెలుపు ఏకపక్షం. ఎందుకంటే అధికార బలం ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్నింటికీ మించి వాలంటీర్ల వ్యవస్థ ఇటువంటి ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. సంక్షేమ పథకాల వల్ల లబ్దిపొందుతున్న ప్రతి ఇంటికి వెళ్లి మీరు ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని చెప్పే పరిస్థితి ఉంది. అందుకే ఒక అభద్రతాభావం, కేసులు, ఓటమి భయాలను తట్టుకుని కూడా టీడీపీ పోటీలోకి అయితే దిగింది.
Telugu Desam Party: ఈ మూడింటిపై టీడీపీ బోలెడు ఆశలు..!
ఇప్పుడున్నా పరిస్థితుల్లో టీడీపీ గెలవడం అంటే కష్టమే. ఒకరకంగా పోటీ చేయడం, పోరాడడమే ఆ పార్టీకి ఎక్కువ.. కానీ ఆ పార్టీ ఏకంగా మూడు, నాలుగు మున్సిపాలిటీలపై గెలుపు ఆశలు పెట్టుకుంది. అందులో ప్రధానంగా కుప్పం ఒకటి, దీన్ని టీడీపీ ప్రతిప్టాత్మకంగా తీసుకుంది. అయితే అధికార వైసీపీ కూడా ఈ సారి కుప్పం స్థానాన్ని ఎలాగైనా దక్కించుకుని చంద్రబాబుకు.. మొత్తం టీడీపీ పార్టీకి తేరుకోలేని షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. అందుకు అధికార పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. టీడీపీ మాత్రం అక్కడ చంద్రబాబు చరిష్మా, అక్కడి ప్రజలపై ఉన్న నమ్మకంతో ఆశలు పెట్టుకుంది. పోల్ మేనేజ్ మెంట్ కూ సిద్దంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ భయం కొంత వెంటాడుతోంది. కుప్పంలో ఎలాగైనా టీడీపీ పోరాడుతుంది. చాలా వరకు చాన్సూలు ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టెస్తే…
* పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడుపైనా టీడీపీ ఆశ పెట్టుకుంది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా టీడీపీ నేత రామరాజు ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో టీడీపీ గట్టిగా పోరాడుతోంది. దానిపై ఆశ పెట్టుకుంది. అందుకే అక్కడా చాలా ఉషారుగా టీడీపీ నేతలు నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం కూడా స్పీడ్ గానే జరుగుతోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజులు మున్సిపాలిటీలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కాపు, క్షత్రియ, బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, కొంత మేర పోల్ మేనేజ్ మెంట్ టీడీపీ చేసే అవకాశం ఉంది.
* కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీపైనా టీడీపీ ఆశ పెట్టుకుంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొండంత అండగా ఉండగా, టీడపీ తరుపున ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఉన్నారు. రెండు సార్లు ఈయన ఎమ్మెల్యేగా పని చేశారు. నామినేషన్ల విషయంలో, ప్రచార విషయంలోనూ టీడీపీ స్పీడ్ గానే ఉంది. పోటాపోటీగానే టీడీపీ ఆశిస్తోంది. టీడీపీ ఆశిస్తున్న మరో మున్సిపాలిటీ కృష్ణా జిల్లా కొండపల్లి. ఇబ్రహీంపట్నం, కొండపల్లిని కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీగా ఇది తొలి ఎన్నిక. ఈ మున్సిపాలిటీలో టీడీపీ గట్టి ఫైట్ ఇస్తుంది.ఇక్కడ టీడీపీ ఇన్ చార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మున్సిపాలిటీని మాజీ ఎమ్మెల్యే ఉమాతో పాటు ప్రస్తుత మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
గతం కంటే కాస్త భిన్నంగా..!
గత 8 నెలల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో అంతగా పట్టించుకోని టీడీపీ ఇప్పుడు ఎన్నికల్లో గట్టిగా పోరాడుతోంది. గెలుపు ఓటములు ఎలా ఉన్నా పోరాటం చేయాలని మాత్రం నిర్ణయించుకుంది. ఎన్నికల్లో పారాడితేనే కార్యకర్తల్లో స్పూర్తి, ధైర్యం వస్తుంది. టీడీపీ అయితే గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఈ మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు నగర పాలక సంస్థపైనా దృష్టి పెట్టింది టీడీపీ. ఇక్కడ టీడీపీకి పెద్దగా బలం అయితే లేదు కానీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రచార వ్యూహం, ఎన్నికల వ్యూహం, ఎవరెవరు ఎలా చేయాలి, పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలి,.డివిజన్ల వారిగా పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను సమీక్షిస్తూ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు అచ్చెన్నాయుడు. నెల్లూరులో ఎన్నికలు అయ్యే వరకూ ఆయన అక్కడే మకాం వేసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. నెల్లూరు లో గత ఫలితాల కంటే ఎక్కువ డివిజన్ల ను టీడీపీ ఆశిస్తోంది. 2014 ఎన్నికల్లో నగర పాలక సంస్థలో 54 డివిజన్లు ఉంటే అందులో 33 వైసీపీ కైవశం చేసుకోగా 17 డివిజన్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు టీడీపీ ఇంత కంటే ఎక్కువ డివిజన్ లను ఆశిస్తోంది. కుప్పంపై ధీమాగా ఉన్న టీడీపీ ఆకివీడు జగ్గయ్యపేట, కొండపల్లి లపై ఆశ పెట్టుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థలో గతం కంటే ఎక్కువ సీట్లను ఆశిస్తున్నది. చూడాలి జనాల తీర్పు ఎలా ఉంటుందో..!?