Russia: రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడితో యావత్ ప్రపంచం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలు లోకి చొరబడిన ఉగ్రవాదులు బాంబులు విసురుతూ .. తుపాకులతో అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా.. వందలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యురిటీ సర్వీస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.
మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాలు నందు శుక్రవారం రాత్రి ప్రముఖ రష్యన్ బ్యాండ్ పిక్ నిక్ సంగీత కార్యక్రమం జరుగుతుండగా, సైనిక దుస్తుల్లో హాలులోకి చొరబడిన అయిదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏమి జరుగుతోందో అర్ధం కాక తీవ్ర భయాందోళనతో అక్కడ ఉన్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాల్ లో చిక్కుకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు. అతి సమీపం నుండి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటకి వచ్చాయి.
ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. దాడి వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడుగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యా లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు.
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసీస్) ఈ దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివారుల్లో మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతే కాదు మా బృందం సభ్యుల దాడి తర్వత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రాఫ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరో వైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది.
ఈ ఉగ్రదాడి ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా ఈ భాధ నుండి బయటపడాలని, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి