నేరాలకు సంబంధించిన కేసుల్లో వెయ్యిమంది నిర్ధోషులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదనేది మన న్యాయశాస్త్రంలోని ప్రధాన అంశం. కానీ మణిపూర్ రాష్ట్రంలో మాత్రం ఓ నిర్ధోషి అత్యాచారం, హత్య కేసులో అన్యాయంగా 8 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించాడు.
ఆ ఎనిమిదేళ్ల తన విలువైన జీవితాన్ని కోల్పోయాడు. దాన్ని ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు. దీనికి ప్రాయశ్చితంగా మణిపూర్ గవర్నమెంట్ ఆ నిర్ధోషికి ఓ ఆఫర్ ప్రకటించింది. అతనికి ఓ గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ఓ సొంత ఇల్లును కూడా ఇస్తామని స్వయంగా సీఎం ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు.
రేప్ అండ్ మర్డర్ కేసులో జైలు
వివరాల్లోకి వెళితే …2013 ఏప్రిల్ 5న మణిపూర్లోని రిమ్స్లో పాథాలజీ విభాగానికి చెందిన ఓ విద్యార్ధిని ఇరిల్బంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంగ్ఖై లౌమాన్బీ లౌకోల్ వద్ద హత్యాచారానికి గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సహచర విద్యార్ధి తౌడమ్ జిబల్ సింగ్ను చేరుస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆ సమయంలో ఓ విద్యార్థి బంగారు భవిష్యత్తుతను చిదిమేశాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ..అతని ఇంటిని కాల్చేశారు.అయితే జిబల్ సింగ్ శిక్ష అనుభవిస్తున్న క్రమంలో సోమవారం (జనవరి 4,2021) అనూహ్యంగా స్థానిక సెషన్సు కోర్టు జడ్జి ఎనిమిదేళ్ల అనంతరం జిబల్ సింగ్ ని నిర్దోషి అని తేల్చారు
ఆ సీఎం ది ఎంతో పెద్ద మనసు!
దీంతో నిర్ధోషి అయిన జిబల్ సింగ్ విడుదల అయ్యారు.అన్యాయంగా తన ఎనిమిదేళ్ల జీవితం జైల్లోనే గడిచిపోయిందని వాపోతూ జిబల్ సింగ్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ను కలిశాడు. అతని పరిస్థితి గురించి తెలసుకున్న సీఎం.. ఎలాంటి తప్పు చేయకుండా 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. జిబల్ సింగ్ కు ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అతనికి అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామి ఇచ్చారు.
అంతా కాదు.. కొంతే ఇవ్వగలిగా:సీఎం
ఈ సందర్భంగా సీఎం బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. అమాయకుడైన జిబల్ సింగ్ జైలు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించటం విచారించదగిన విషయం అని..అతను కోల్పోయిన జీవితాన్ని ఎలాగూ తెచ్చి ఇవ్వలేం. కానీ కొంతలో కొంత భర్తీచేయాలనిపించింది. నేరస్థుడనే ముద్ర వేసుకుని అతని జీవితంలో చాలా కోల్పోయాడు. పైగా అతని ఇల్లును కూడా కోల్పోయాడు. అందుకే అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఓ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో జిబల్ సింగ్ సంతోషం వ్యక్తంచేశాడు.