కరోనా వైరస్ నేపథ్యంలో గత 5 నెలలుగా థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. లాక్డౌన్ తో ఆరంభమైన వాటి మూసివేత ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో వాటికి గడ్డుకాలం ఎదురైంది. మరోవైపు నిర్మాతలు సినిమాలను ఓటీటీ ప్లాట్ఫాంలపై విడుదల చేస్తుండడం థియేటర్ల యజమానులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే అన్లాక్ 4.0 లో భాగంగా థియేటర్ల ఓపెనింగ్కు అనుమతులు ఇస్తారని తెలుస్తుండడంతో వారికి ఆశలు చిగురిస్తున్నాయి. మళ్లీ బిజినెస్ ప్రారంభం అవుతుందని కొంత ఊరట చెందుతున్నాయి.
అయితే థియేటర్లను ఓపెన్ చేసినప్పటికీ కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు కనుక ఇప్పుడప్పుడే ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వచ్చే అవకాశం లేదు. కనుక వారిని ఆకట్టుకోవాలంటే మొదటి 2 నుంచి 4 వారాల వరకైనా ఆఫర్లు, డిస్కౌంట్లను అందజేయాలని థియేటర్ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. దీని వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని భావిస్తున్నాయి.
కాగా కార్నివాల్ సినిమాస్ వారు అత్యవసర సేవలను అందించే సిబ్బందికి ఉచితంగా టిక్కెట్లను అందిస్తారని తెలుస్తోంది. అలాగే రెండు టిక్కెట్లను కొన్నవారికి మరొక టిక్కెట్ను ఉచితంగా అందించేలా ఆఫర్లను ప్రకటించనున్నారని తెలిసింది. ఆ ఉచిత టిక్కెట్ను మళ్లీ ఇంకొక సినిమాకు ఉపయోగించుకోవచ్చు. ఇలా మళ్లీ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చు.
అలాగే పీవీఆర్ సినిమాస్ వారు థియేటర్లను ఓపెన్ చేశాక మొదటి నాలుగు వారాల వరకు టిక్కెట్లు, ఫుడ్, శీతల పానీయాలపై ఆఫర్లు, రాయితీలను అందించాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంత చేసినా థియేటర్ల యాజమాన్యాలు థియేటర్లలో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే ప్రేక్షకుల ఆక్యుపెన్సీ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. అయితే దీపావళి వరకు పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. మరి అన్లాక్ 4.0లో థియేటర్లను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తారో, లేదో చూడాలి.