ఎన్నికల వేళ.. పొత్తుల ప్రభావం టీడీపీపై తీవ్రంగా పనిచేస్తోంది. పోటీకి చాలా మంది నాయకులు సొంత పార్టీలోనే ఉండడం.. మరోవైపు.. పొరుగు పార్టీల నుంచి కూడా నాయకులు క్యూ కట్టడంతో టికెట్ల కేటాయింపు ఇబ్బందిగాన ఉంది. తాజాగా ఈ వ్యవహారం.. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలోనూ తెరమీదకి వచ్చింది. ఇక్కడ నుంచి ఈ సారి గెలిచి తీరాలని.. వైసీపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. టీడీపీ నాయ కులు భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈక్వేషన్లే ఇబ్బందిగా మారాయి.
ఇప్పటి వరకు..
రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ 2004లో చివరి సారి గెలిచింది. మళ్లీ ఇప్పటి వరకూ గెలవలేదు. గత నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున, వైసీపీ తరపున పోటీ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయి తే ఈ సారి గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్న తమ్ముళ్లు టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ తామే పోటీలో ఉన్నామని. చంద్రబాబు కరుణ తమకేనని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఎవరి జెండా మోయాలో తెలియక క్యాడర్ గందరగోళంలో పడింది.
వీరంతా ఆశావహులే..
రాయచోటి టికెట్ కోసం.. మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, గడికోట ద్వారకనాధరెడ్డి, ఆర్,రమేష్రెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. అసెంబ్లీ ఇన్ఛార్జి ఆర్.రమేష్రెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు దగ్గరయ్యేందుక ఆయన కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.
వచ్చింది టికెట్ కోసమేనా..
ఇటీవల వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాధరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది. ఆయన కూడా టిక్కెట్ ప్రయత్నాలు చేసుకుంటు న్నారు. అంతేకాదు.. టికెట్ కోసమే వచ్చానంటూ.. అనుచరుల దగ్గర చెబుతున్నారు. వైసీపీలో ఉంటే న్యాయం జరగదనే ఇక్కడికి వచ్చానంటున్నారు. ఇక, టీడీపీ టికెట్ తనకు ఇచ్చారనే పేరుతో రాంప్రసాద్రెడ్డి సామాజిక మాద్యమాల్లో లీకులివ్వడం మరో చర్చగా మారింది.
ఎంపీ, ఎమ్మెల్యేగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించిన సుగువాసి పాలకొండరాయుడు తనయుడు ప్రసాద్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రాయచోటి సీటు అడుగుతున్నారు. ఆయన ఇప్పటికే లోకేష్ బాబు ను, ఇటీవల పులివెందులలో పార్టీ అధినేత చంద్రబాబును కలసి టిక్కెట్ తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే.. బాబు మాత్రం ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ, ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఏంచేస్తారోచూడాలి.