ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జనరల్ నియోజకవర్గం ఎమ్మిగనూరులో వచ్చే ఎన్నికలకు సంబంధించి అదికార పార్టీ వైసీపీలో అసమ్మతి బెడద జోరుగా వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి.. వయోవృద్ధుడనే కారణంగా ఆయనను తప్పించారు. దీంతో ఆయన సూచించిన వారికి తొలుత ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. తర్వాత అనూహ్యంగా ఆయన గ్రాఫ్ బాగోలదంటూ.. మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశం ఇచ్చారు. దీంతో స్థానిక నాయకత్వం .. ఆమెతో కలిసి పనిచేసేది లేదని.. తిరిగి సిట్టింగుకే సీటు ఇవ్వాలని లేదా.. వేరేవారిని కేటాయించాలని రగడ చేస్తోంది. ఈ పరిణామం వైసీపీలో సెగ పెడుతోంది.
ఇక, టీడీపీలోనూ మరో రగడ తెరమీదికి వచ్చింది. ఈ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో బీసీలు అధికంగా ఉండే నియోజకవర్గం కావడంతో ఎమ్మెల్యే టికెట్ను బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ ఐక్యవేదిక టీడీపీని డిమాండ్ చేస్తోంది. తాజాగా 30 కులాల బీసీ నాయకులు భారీ ఎత్తులో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేసేశారు. టీడీపీకి బీసీలు వెన్నెముకలా ఉన్నారని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1975 నుండి బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పార్టీలు టికెట్లు ఇవ్వలేదని ఇప్పుడైనా బీసీకి టికెట్ ఇవ్వాలని వివిధ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
తమ డిమాండ్కు టీడీపీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. మాచాని సోమప్ప ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎనలేని కృషి చేశారని, ఇప్పుడు వారి ముని మనవడు డాక్టర్ మాచాని సోమనాథ్ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా నిలబడడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. నిలబడడానికి సిద్ధమైన తరుణంలో వారికి ఎమ్మెల్యే టికెట్ను ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుని అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని, ఈ బాధ్యతను తాము స్వీకరిస్తామని కొందరు బీసీ నేతలు తెలియజేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీలో తర్జన భర్జన ప్రారంభమైంది.
వైసీపీ తీసుకున్న నిర్ణయం ఇక్కడ రాజకీయాలను రాజేసిందనే వాదన వినిపిస్తోంది. ఆది నుంచి అంటే.. 2004 నుంచి ఇక్కడ రెండు కీలక పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలకే టికెట్లు ఇస్తున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నకేశవ రెడ్డి, టీడీపీ నుంచి బీవీ మోహన్రెడ్డి పోటీ చేయగా చెన్నకేశవరెడ్డి విజయం దక్కించుకున్నారు. 2009లో ఈ రెండు పార్టీలూ వీరికే టికెట్లు ఇవ్వగా.. మూడో పార్టీ ప్రజారాజ్యం కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డికే టికెట్ ఇచ్చింది. 2012 ఉపపోరులో చెన్నకేశవ రెడ్డి వైసీపీ తరఫున, బీవీ మోహన్రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు.
2014లో టీడీపీ బీవీ జయనాగేశ్వరరెడ్డికి అవకాశం ఇవ్వగా ఆయన విజయం దక్కించుకున్నారు. ఇదే ఎన్నికల్లో వైసీపీ కె. జగన్మోహన్రెడ్డికి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ చెన్నకేశవరెడ్డికి ఇచ్చింది. ఈయన గెలిచారు. టీడీపీ జయనాగేశ్వర్రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇలా.. ఇప్పటి వరకు 4 ఎన్నికల నుంచి రెడ్డి వర్గమే ఉంది. కానీ, ఇప్పుడు వైసీపీ బీసీ మంత్రం పఠించింది. దీంతో ఇక్కడ వివాదాలకు దారితీస్తోంది.