రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనన్ని పదవులను బీసీలకు ఇచ్చినా కూడా జగన్ ప్రభుత్వం వారి మనసు గెలుచుకోలేకపోయిందా అన్న అనుమానం కలిగే రీతిలో కొన్ని పరిణామాలు ఏపీలో చోటు చేసుకున్నాయి.బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అన్న నినాదంతో వైసిపి ప్రభుత్వం వారికి అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ వస్తోంది.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే బీసీలను తమ వైపుకు తిప్పుకోవాలన్న యోచనతో ముఖ్యమంత్రి జగన్ ఈ పథక రచన చేశారు.ఇటీవలి కాలంలో ఆయన కేవలం బీసీల జపం చేస్తున్నారని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ,మోపిదేవి వెంకట రమణ లను రాజ్యసభకు పంపారు.ఒక బీసీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చారు.ఎమ్మెల్సీ పదవుల్లో కూడా ప్రాధాన్యం కల్పించారు.తాజాగా 132 బీసీ కులాలకు యాభై ఆరు బీసీ కార్పోరేషన్లను నూతనంగా ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు డైరక్టర్లుగా దాదాపు ఎనిమిది వందల మందికి పదవుల పందేరం చేసారు.తద్వారా బిసి కులాల కూడా రాజ్యాధికారం ఇచ్చామని మంత్రులు బొత్స సత్యనారాయణ ,వేణుగోపాలకృష్ణ తదితరులు ఘనంగా ప్రకటించుకున్నారు.
సరే యథాప్రకారం టిడిపి ఈ కార్పొరేషన్ లఏర్పాటును ఆక్షేపించింది ఇవి కేవలం ప్రచార పటాటోపమే తప్ప వాటికి నిధులు విధులు లేవని విమర్శించింది సొంత పార్టీ వారికి ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలని వైసిపిని ఘాటుగా విమర్శించడం జరిగింది.సరే టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అలా అనిందనుకొ౦టే బీసీలలో కూడా ఎక్కడా సానుకూల స్పందన వ్యక్తం కాకపోగా ఏకంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజయవాడలో సమావేశం నిర్వహించి వైసిపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది .చిన్నచిన్న పదవులతో బీసీలు సంతృప్తి చెందడం లేదని , బీసీ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చబోతున్నామని సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు ఈ సభలో ప్రకటించారు.
వైసీపీతో సహా ప్రస్తుత రాజకీయ పార్టీలేవీ బీసీలకు న్యాయం చేయడం లేదు కాబట్టి ఆరునెలల్లోనే బీసీల కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించారు.బీసీలకు సొంతపార్టీ ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.బీసీలంతా ఇప్పటినుంచి ఏకతాటిపై నడిపి రాజ్యాధికారంతో సహా ఆర్థిక రాజకీయ హక్కులు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసరావు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడే బిసిల రాజకీయపార్టీకి తెలంగాణలోని బీసీ సంఘాలన్నీ మద్దతు ఇస్తాయని సభాముఖంగా ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్లో బీసీల వ్యవహార శైలి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది .వైసిపి కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.