తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్కు సుధాకర్ యాదవ్ పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీమానా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణం తన రాజీనామా ఆమోదించాలని ఆయన కోరారు.
ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడటంతో చాలా మంది బోర్డు డైరెక్టర్లు స్వచ్చందంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ తాను చైర్మన్ పదవికి రాజీనామా చేయననీ, ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తేనే చైర్మన్ పదవి నుండి తప్పుకుంటానని సుధాకర్ యాదవ్ పేర్కొంటూ వచ్చారు.
ఇప్పటికే టిటిడి చైర్మన్గా వైసిపి సీనియర్ నేత, మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో గత ప్రభుత్వం నియమించిన దేవాలయ పాలకవర్గాలు, ఇతన నామినేటెడ్ పదవులను ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడకముందే టిటిడి చైర్మన్ సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు.