న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రధాన ఎజండాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో నేడు అఖిలపక్ష భేటీ నిర్వహించారు. పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆహ్వానాలు పంపగా కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, ఆప్, ఎస్పి, బిఎస్పి, డిఎంకె, టిడిపి అధినేతలు గైర్హాజరు అయ్యారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు రాజ్నాధ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ,ఎన్సిపి అధినేత శరద్ పవార్, జెయుడియూ అధ్యక్షుడు నితిష్ కుమార్, బిజెడి నేత నవీన్ పట్నాయక్, శిరోమణి అకాళీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, లోక్ జనశక్తి అధినేత రాంవిలాస్ పాస్వాన్, పిడిపి అధినేత్రి మహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం రాజ్నాథ్సింగ్ మీడియాకు వివరాలు తెలియజేశారు. అఖిలపక్ష సమావేశంలో 21 పార్టీల అధ్యక్షులు హాజరయ్యారని రాజ్నాధ్ సింగ్ తెలిపారు. మూడు పార్టీల అధ్యక్షులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారన్నారు. మొత్తం 24 పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయని రాజ్నాధ్ సింగ్ చెప్పారు.
ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలకు దాదాపు పార్టీలన్నీ మద్దతు తెలిపాయని రాజ్నాధ్ వెల్లడించారు. వామపక్షాలతో పాటు ఎంఐఎం జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయని ఆయన చెప్పారు. దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారనీ, నిర్థిష్ట కాలపరిమితిలో కమిటీ నివేదిక ఇస్తుందని రాజ్నాధ్ స్పష్టం చేశారు.
కమిటీలో ఎవరెవరు ఉంటారో ప్రధాని నిర్ణయిస్తారని రాజ్నాధ్ సింగ్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగించడానికి అందరూ అంగీకరించారని రాజ్నాధ్ సింగ్ చెప్పారు. చర్చల ద్వారా అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని రాజ్నాధ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అన్ని పార్టీలను పరిగణలోకి తీసుకునే తుది నిర్ణయం ఉంటుందని రాజ్నాధ్ సింగ్ తెలిపారు.