అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నారు. అయినా జీతాలకూ కటకట. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
మళ్ళీ గెలుస్తామనే నమ్మకం లేదు కాబట్టే చివరి నిమిషం వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాని అనుభవించాలని అనుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఒకవేళ మళ్ళీ గెలుస్తామనే నమ్మకం ఉండి ఉంటే ఐదేళ్ళు టైం దొరకదని చంద్రబాబు మనవడిని తీసుకొని దేశాలు తిరిగొచ్చేవారని ఆయన అన్నారు.
చంద్రబాబు మానసిక స్థితి గురించి ఆందోళన చెందిన సన్నిహితులు ఒక క్రియేటివ్ డైరెక్టర్ కలిశారనీ, మే 23 తర్వాత చంద్రబాబు కుర్చీ వదలడు కాబట్టి ఒక స్టూడియోలో సెక్రటేరియట్ సెట్టింగ్ వేసి ఇంకా తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉంచాలని చెప్పారనీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. డమ్మీ సెక్రటేరియట్, చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కోసం ఎంపిక మొదలైందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ పై కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మే 23 తర్వాత పప్పునాయుడు ఏం చేస్తాడనే దానిపై రకరకాల జోకులు వైరల్ అవుతున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. ‘తనను ముఖ్యమంత్రి చేస్తానని తండ్రి మాట తప్పాడని అలిగి సింగపూర్ వెళ్లి పోతాడట. ఓడిపోతామనే విషయం దాచి, కచ్చితంగా గెలుస్తామని తండ్రి తననూ ఎందుకు మోసం చేశాడో అర్థం కాక ఆ పసిమనసు విలవిల్లాడుతోందట’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తే ఎన్నికల సంఘం ఆంక్షలపై లోకేష్ చేసిన ట్వీట్కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పప్పు మరోసారి తన ఐ-క్యూ స్కోరు (25-39) బయట పెట్టుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్షల్లో సిఎస్, డిజిపిలు ఎలా పాల్గొంటారు అని పళ్ళు కొరుకుతున్నాడు. చిట్టీ, ఆ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉంది. మీ నాన్నారు సమీక్షలు జరపడానికి వీలు లేదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.