అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకొవచ్చని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయసాయిరెడ్డి అవగాహనా లోపంతోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి లేఖ రాశారని ఆయన విమర్శించారు.
యనమల సోమవారం అమరావతిలో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డిది తప్పుడు వాదన అని అన్నారు. ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో పార్టీ సమావేశం పెట్టుకోవడంలో తప్పు లేదన్నారు.
మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని యనమల చెప్పారు. మంత్రిమండలి కంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎక్కువ కాదని యనమల పేర్కొన్నారు. ఈరోజు ఎన్నికల మీద సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనీ, ప్రజావేదికలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవనమని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయిన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను చంద్రబాబు వాడుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించటానికి ఎన్నికల సంఘం అనుమతి అవసరమనీ, చంద్రబాబు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారో, లేదో కూడా తమకు తెలియపరచాలనీ విజయసాయిరెడ్డి కోరారు.
పార్టీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు నేడు ప్రజావేదికలో పార్టీ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ గెలుపు అవకాశాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.