అమరావతి, ఏప్రిల్ 21: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన పది రోజుల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ సరళి, ఫలితాల అంచనాకై ముఖ్య నేతలు, అభ్యర్థులతో ఆదివారం సమావేశం అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
పోలింగ్కు ముందు మూడు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బిజిబిజీగా గడపిన పవన్ కళ్యాణ్ 11వ తేదీ పోలింగ్ పూర్తి అయిన వెంటనే హైదరాబాదు వెళ్లిపోయారు. పోలింగ్ సరళి, ఫలితాలపై నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించడం గానీ, ఫలితాల అంచనాపై ప్రకటన చేయడం గానీ చేయలేదు.
తొలి విడత సమీక్షలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం, విజయనగర్, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులతో పవన్ సమావేశం అయ్యారు. పోలింగ్ సరళి, గెలపు అవకాశాలు, ఈవిఎంల పనితీరు, భవిష్యత్తు కార్యాచరణ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తదితర విషయాలపై నాయకులతో విస్తృతంగా చర్చించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు సరిగా ప్రచారం నిర్వహించలేదన్న పార్టీ ఇచ్చిన సమాచారంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అధికార, ప్రతిపక్షాలు వందకు పైగా స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటనలు చేస్తున్న తరుణంలో పోలింగ్ తరువాత జనసేన ఇప్పటి వరకూ ఎన్ని స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉందన్న విషయంపై ప్రకటన విడుదల చేయలేదు.
రాష్ట్రంలో ప్రధాన పోటీ వైసిపి, టిడిపీ జరిగినప్పటికీ కోస్తాంధ్ర, ఉత్తరాంద్రలోని పలు జిల్లాలతో జనసేన ప్రభావం కారణంగా ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని భావిస్తూ వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా మిత్రపక్షాలైన బీఎస్పి 21, సిపిఎం, సిపిఐ 14 స్థానాల్లో పోటీ చేశాయి.