ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ శాసనససభ్యుడు గొట్టిపాటి రవికుమార్ వైసిపి వైపు అడుగులు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి కొత్తవి కాకపోయినా… ఇటీవల నియోజకవర్గంలో పరిణామాలు మాత్రం మళ్ళీ ఆయన రాజకీయం చుట్టూ ప్రశ్నలు మిగిల్చాయి. ఆయన సైలెంట్ గా ఉండడం.., ద్వితీయ శ్రేణి నేతలు అధికార పార్టీవైపు చేస్తుండడం.., ఇటు ఎమ్మెల్యే కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండడం కారణం అంటున్నారు.
తన రాజకీయ భవితవ్యం తోపాటు కుప్పకూలిన వ్యాపార సామ్రాజ్యాన్ని పునరుద్ధరించుకోవాలంటే అధికారపార్టీకి, జగన్ కి జై కొట్టడం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి ఆ శాసనసభ్యుడు వచ్చేశారని చెబుతున్నారు. 2004 నుండి ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచిన అజేయుడు గొట్టిపాటి రవికుమార్. తొలిసారిగా మార్టూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన రవి పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దుకావడంతో అద్దంకికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ మూడు సార్లు ఆయన విజయకేతనం ఎగురవేశారు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైసీపీ పక్షాన ఆయన పోటీ చేసి గెలిచారు. అయితే కారణాలేవైనప్పటికీ 2017 లో గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో అద్దంకి నుండి టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగాక గొట్టిపాటి రవికుమార్ టార్గెట్ అయ్యారు.
గ్రానైట్ వ్యాపారం చేసే రవికుమార్ సంస్థలపై లెక్కలేనన్ని సార్లు విజిలెన్స్ దాడులు జరిగాయి. రవికుమార్ సంస్థలు రాయల్టీని ఎగ్గొట్టాయని పేర్కొంటూ కోట్ల రూపాయల జరిమానాను ప్రభుత్వం ఆయనకు విధించింది. చివరకు ఆయన గ్రానైట్ సంస్థల లైసెన్సులను కూడా ప్రభుత్వం రద్దు చేయగా రవికుమార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలో రవికుమార్ కి ఇదో నిత్యపోరాటంగా మారింది. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వంతో పోరాడుతూ వ్యాపారం చేయలేమన్న నిరాశానిస్పృహలకు రవికుమార్ గురయ్యారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీలో చేరిపోవడమే ఉత్తమమని ఆయన నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.పైగా జిల్లాలో వైసిపి స్టీరింగ్ తిప్పుతున్న మంత్రి బాలినేని వాసు ఎమ్మెల్యే రవికుమార్ కు సన్నిహితుడు.వారి మధ్య వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవికుమార్ మంత్రిని కలిసి తన గోడు చెప్పుకున్నాడని సమాచారం.తనకు అద్దంకి సీటుపై హామీ ఇస్తే చాలని రవికుమార్ షరతు పెట్టారట.అయితే రవికుమార్ ఒకసారి వైసీపీ నుండి టిడిపిలోకి వెళ్లి నందువల్ల మళ్లీ పార్టీలో చేర్చుకోవాలంటే జగన్ అనుమతి తప్పనిసరి అని ఆయనకు మంత్రి స్పష్టం చేశారని భోగట్టా.సమయం చూసుకొని సీఎంతో మాట్లాడి ఏ విషయమూ చెబుతానని మంత్రి వాసు ఆయనకు తెగేసి చెప్పారట.కాగా టిడిపి వర్గాలకు కూడా గొట్టిపాటి రవికుమార్ పోకడలపై అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది.మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో నాలుగు స్థానాల్లో టిడిపి గెలవగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపికి జై కొట్టి వెళ్లిపోయారు.
ఇక ముగ్గురు మిగలగా తాజాగా శుక్రవారం ప్రకటించిన టిడిపి రాష్ట్ర కమిటీలో కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు.పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును బాపట్ల పార్లమెంట్ టిడిపి అధ్యక్షులుగా నియమించారు.ఒక్క రవికుమార్ కి మాత్రం టిడిపిలో ఏ పదవి ఇవ్వకపోవడం ఇక్కడ గమనార్హం.నిజానికి బాపట్ల పార్లమెంటు టిడిపి అధ్యక్షులుగా ముందు గొట్టిపాటి రవికుమార్ నే అనుకున్నారు.అయితే ఆయన ఏదో కారణం చెప్పి ఆ పదవి వద్దన్నారు.ఈ మధ్యలో రవికుమార్ వైసిపి నేతలతో టచ్ లోకి వెళ్లారని సమాచారం అందడంతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయనను పక్కన పెట్టేశారని టాక్. ఎమ్మెల్యే రవికుమార్ వైసీపీలో చేరిక విషయాన్ని అలా ఉంచితే, ప్రస్తుతం అద్దంకి వైసిపి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే గరటయ్య వ్యవహారశైలి కారణంగా కొంతమంది మండలస్థాయి టిడిపి నాయకులు నాయకులు వైసిపిలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సమాచారం.తదుపరి జరిగే పరిణామాలను గమనించాక అవసరమైతే వారు మళ్ళీ ఎన్నికల సమయంలో తిరిగి టిడిపిలోకి వచ్చే అవకాశం కూడా లేక పోలేదు.మొత్తం మీద అద్దంకిలో ఏదో జరగబోతోందన్న సంకేతాలైతే వచ్చేశాయి!