తెలంగాణలో కొత్తగా పదవుల పందేరం మొదలైంది. ఇదంతా.. కేసీఆర్ ఇలాకాలో ఏ మంత్రి పదవి కోసమో అనుకునేరు. జీహెచ్ఎంసీలో ‘మేయర్’ పదవి కోసం. ఇందుకోసం పైరవీలు మొదలయ్యాయి. జనరల్ కేటగిరీ కావడంతో మేయర్ పీఠం ముగ్గురు మంత్రుల మధ్య చిచ్చు పెడుతోంది. అగ్ర నాయకత్వానికి సమస్యలు తెచ్చిపెడుతోంది. ముగ్గరు మంత్రులూ టీఆర్ఎస్ ప్రముఖులే. ప్రస్తుతం ముగ్గురికీ విడివిడిగా ఉన్న లక్ష్యం తమ ‘కోడలు’ని మేయర్ ను చేయాలనే..! ఇందులో భాగంగా ఒకరు బాస్ నుంచి వస్తుంటే మరొకరు చిన బాస్ నుంచి వస్తున్నారు. ఆ ముగ్గురు అమాత్యులే.. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి. మొత్తంగా ఈ వ్యవహారం జీఎచ్ఎంసీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది.
తలసాని శ్రీనివాస్ యాదవ్..
టీఆర్ఎస్ లో ప్రముఖ నాయకుడిగానే కాదు.. రెండో దఫా కూడా మంత్రిగా ఉన్న తలసానికి పార్టీలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కుమారుడు తలసాని సాయికిరణ్ 2019 ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సాయి కిరణ్ భార్యను కార్పొరేటర్ గా నిలబెట్టి, గెలిపించి.. కోడలని మేయర్ ను చేయాలనేది శ్రీనివాస్ యాదవ్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకు కేటీఆర్ వైపు నుంచి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సీహెచ్ మల్లారెడ్డి..
గతంలో టీడీపీ తరపున అతిపెద్ద నియోజకవర్గమైన మల్కజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచారు. తదనంతర పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019లో తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన కుమారుడు ధర్మారెడ్డి భార్యను మేయర్ ను చేయాలనేది ప్లాన్. ఇందుకు కార్పొరేటర్ గా నిలబెడుతున్నారు. ఈయన ఏకంగా సీఎం కేసీఆర్ నుంచి పావులు కదుపుతున్నారు.
సబితా ఇంద్రారెడ్డి..
మహేశ్వరం ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఆమె కుమారుడు గతంలో ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తన కోడలిని రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసి గెలిపించి మేయర్ ను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. వీరందరి ప్రయత్నాలు ఏమేరకు సఫలమవుతాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది.