కరోనా దెబ్బకి.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.లక్ష కోట్ల కొత్త అప్పు ఏడాడో దాటేసిందంటూ వైఎస్ జగన్ పాలనపై విపక్షాలు విమర్శలు చేస్తోన్న విషయం విదితమే.
విపక్షాల ఆరోపణల్ని పక్కన పడితే, రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలే పెరిగిపోతున్న అప్పుల గుట్టు విప్పేస్తున్నాయి.నిబంధనలకు లోబడి చేసే అప్పులు, అత్యవసర అప్పులు,ఇవి కాక ‘చేబదుళ్ళు’వెరసి, రాష్ట్ర ప్రజల నెత్తిన కనీ వినీ ఎరుగని రీతిలో అప్పు భారం మోపేస్తోందట వైఎస్ జగన్ సర్కార్!అయితే దీన్ని లోగుట్టు గా ఉంచి అంతా సవ్యంగా ఉన్నట్లు వైసిపి ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది! అంతే కాదు ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు ,వైయస్ జగన్మోహన్ రెడ్డి లది ఒకటే పంధా అంటున్నారు .
చంద్రబాబు నాయుడు ఆయన శైలిలో ఆయన ఖర్చుపెట్టి వీలైనన్ని అప్పులు చేశారు అధికారం లొ ఉన్న౦తకాలం దాన్ని దాచి పెట్టారు.ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు. కానీ చంద్రబాబు కనీ వినీ ఎరుగని రీతిలో అప్పులు చేసినట్లు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఊరూ వాడా తిరిగి విమర్శించారు. అయితే అప్పుల విషయంలో చంద్రబాబు రికార్డ్ని అతి తక్కువ సమయంలోనే వైఎస్ జగన్ అధిగమించేస్తున్నట్లు ఇప్పటికే లెక్కలు కూడా బయటకు వస్తున్నాయి.
దీన్ని తిప్పి కొడుతూ టిడిపి అప్పులకు లెక్కల్లేవు మా అప్పులకు లెక్కలన్నీ ఉన్నాయని వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు!అయితే ముందు ముందు రాష్ట్ర ఆదాయం పెరిగినా.. అది వడ్డీలు కట్టడానికి కూడా సరిపోకపోవచ్చు..’ అని ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు అయినా జగన్ తీసుకున్న రుణాలు అయినా తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలే కదా!ఏ రాయి అయితేనేం పళ్లు వూడ గొట్టుకోడానికి!