జర్నలిజం అనేక దశల్లో ఉంటుంది. ఓ స్థాయి దాటాక ప్రొఫషనలిజం ఉంటుంది. ప్రాఫెషనల్ జర్నలిజం ఎప్పుడూ హుందాగానే ఉంటుంది. వ్యవస్థలకు కావాల్సింది అదే…! కానీ రాష్ట్రంలో అది దరిదాపుల్లో కూడా లేదు. చంద్రబాబుపై సాక్షి ఏడుపు.., జగన్ పై ఆంధ్రజ్యోతి ఏడుపు మనం చూస్తూనే ఉంటాం..! అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏడుపు ఒక స్థాయిని మించి.. శాపనార్ధాలు వరకు వెళ్ళింది.
చంద్రబాబు ఆరు లక్ష కోట్లు తినేశాడని అనుకుంటున్నారు…!
జగన్ మళ్ళీ లక్షన్నర కోట్లు తినేసాడట.., మళ్ళీ సీబీఐ కేసులకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం…!
బీజేపీలో ముసలం ముదిరి.., కన్నాని సస్పెండ్ చేసేస్తారని సమాచారం.
పైవన్నీ వేక్ జర్నలిజం పాయింట్లు. ఆధారాలు ఉండవు. తోచింది రాసేసి, వాళ్ళు, వీళ్ళు అనుకుంటున్నారని పెట్టేయడమే. ఇది ఒక దశ వరకు బాగానే ఉంటుంది. కానీ శృతి మించితే… హద్దు దాటి వ్యవస్థలకు అంటగడితే వెగటు పుడుతుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్నది అదే.!
పైనున్న పేరాలో చుడండి. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగాక అవినీతి కేసుల్లో విచారణ వేగం చేసి, అతన్ని అరెస్టు చేసేయాలని బీజేపీ ఆలోచనట. ఆ విషయం రాధాకృష్ణకు చెప్పారట…!! అప్పుడు వైసిపిని బీజేపీలో విలీనం చేసేయాలని ఒత్తిడి చేస్తారట. 30 ఏళ్ళ పాటు సీఎం గ అంటానన్న జగన్ భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉందట..!! ఇవి ఆర్కే ఊహలే… తనకు కావలసినట్టు, తనకు అనుగుణంగా ఊహించుకుంటూ అందుకు ఏడుపు జోడించి రాయడం ఇదే.
నాడు కాంగ్రెస్ అని, నేడు బీజేపీ అని…!!
ఇవే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్తపలుకుని 2011 , 2012 లో చూసుకుంటే వైసిపి కాంగ్రెస్ లో భాగమని, పిల్ల కాంగ్రెస్ అని రాశారు. ఇప్పుడు బీజేపీలో భాగమంటూ రాస్తున్నారు. కాంగ్రెస్ కీ, బీజేపీ కి ఎంత తేడా ఉందొ తెలియనిది కాదు. నాడు చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా పదే పదే వైసిపి ని పిల్ల కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శించేవారు. 2014 ఎన్నికల సందర్భంగా కూడా తల్లి కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని మోసం చేసింది.., ఈ పిల్ల కాంగ్రెస్ కి ఓటేసినా వారికి వేసినట్టే అంటూ ప్రచారం చేసారు.., ఏబీఎన్ లో రాశారు. ఇప్పుడు పిల్ల బీజేపీ ని రాసినా ఆశ్చర్యం అవసరం లేదు. “కేసుల్లో రాజీ కోసం.. జగన్ బీజేపీ ముందు కాస్త తల వంచుతున్నాడు” అని రాయడం వరకు సబబు.., కానీ మరింత ముందుకు వెళ్లి ఊహలను రాయడమే ఇక్కడ జర్నలిజంలో రోతలు అనేది.
న్యాయవ్యవస్థని రెచ్చ గొట్టడంలో భాగమా…??
ఇక రాష్ట్రంలో శాసన వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకు తెలియని అగాధం ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆర్కే వంటి వారు న్యాయ వ్యవస్థ వైపు చేరినట్టు చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రెండు వ్యవస్థలు రాష్ట్రానికి కీలకం. పాలన గాడి తప్పితే సరిచేయాల్సింది న్యాయ వ్యవస్థలు. కూడు, గూడు ఎంత ముఖ్యమో.., ప్రజలకు న్యాయం కూడా అంతే ముఖ్యం. “జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ కాల్ రికార్డు దొరినప్పటి నుండి రాధాకృష్ణ రాతల్లో దూకుడు పెరిగింది. ఇక్కడ ఒక ప్రాధమిక సూత్రాన్ని చెప్పుకోవాలి. రాధాకృష్ణ అతి తెలివికి మచ్చుగా దీన్ని పేర్కొనాల్సిందే.
“ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెడతారు. లీగల్ యాక్షన్ కి దిగుతారు. అప్పుడు తనకు అండగా నిలవాల్సింది కోర్టులే. మరోవైపు జగన్ బృందం కూడా కోర్టుల విషయంలో అతి చేస్తున్నారు. న్యాయ వ్యవస్థపై ఆ పార్టీ నేతల వైఖరి బాలేదు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకున్న ఆర్కే న్యాయ వ్యవస్థకు తాను కంకణ బద్ధుడిగా మారిపోయి… జగన్ పైకి, ప్రభుత్వం పైకి ఉసిగొల్పే ప్రయత్నాల్లో మునిగిపోయారు. దానిలో భాగమే ఈ రాతలు. తనకు అండగా జడ్జిలు, న్యాయ వ్యవస్థ ఉంటె, ప్రభుత్వం ఏమి చేయలేదు అనేది ఆర్కే దూరపు ఆలోచన.
“మొత్తానికి న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్న జగన్ ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుందని.. అప్పుడు బీజేపీ మళ్ళీ రంగంలోకి దిగి జగన్ కేసులను గుర్తు చేసి పార్టీని కలిపేసుకుంటుందని… రాధాకృష్ణ కన్న కలలను తన పత్రికలో “కొత్తపలుకు”గా రాసుకొచ్చారు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!