ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు కరోనా వైరస్సోకిందట. ఈ విషయాన్ని ఆమె కరోనా నుంచి కోలుకున్న తరువాత వెల్లడించింది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఆమె కరోనా బారిన పడ్డానని స్పష్టం చేసింది. అందరిలాగానే తను కరోనా పాజిటివ్ అని తెలియగానే తన కుటుంబానికి మరియు కుమారుడికి దూరంగా ఐసొలేషన్ లో గడిపానని అది అనుకున్న అంత తేలిక ఏమి కాదని ఇది చాలా కష్టం అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల సానియా మీర్జా తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.
‘నేను ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన సంఘటనలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ఆ భగవంతుడి దయవల్ల నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. కానీ నాకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఏమి కనిపించలేదు. ఇందులో నన్ను ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏమిటంటే నా రెండేళ్ల కుమారుడికి అలాగే కుటుంబానికి దూరంగా ఐసొలేషన్ లో ఉండటం. నాకు ఆ పరిస్థితి వచ్చాక అర్ధం అయ్యింది కరోనా సోకి వారు వారి కుటుంబాలకు దూరంగా ఆసుపత్రుల్లో ఒంటరిగా ఉంటూ ఎంత బాధను అనుభవిస్తున్నారో… నేను ఆలా ఉండలేకపోయా.
ప్రతి రోజు కొత్తకొత్త విషయాలు కరోనా కి సంబంధించి వినాల్సి వచ్చినప్పుడు నాకు భయంవేసేది. రోజుకొక కొత్త లక్షణం మనుషులలో కనిపిస్తుంది అనివార్తలు వస్తుండేవి. ఇది అటు మానసికంగా ఇటు శారీరకంగా ఆ విషయాలు నన్ను ఎంతో బాధించాయి. నేను నా కొడుకుని, కుటుంబ సభ్యులను తిరిగి ఎప్పుడు చూస్తానో అనే భయం నాలో చాలా ఉండేది. ఈ మహమ్మారిని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి’ అని సానియా మీర్జా తన సోషల్ మీడియా లో తెలిపింది.