YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను నేటి నుండి ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ “మేమంతా సిద్ధం” పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బస్సు యాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ యాత్ర 27వ తేదీ (బుధవారం) నుండి 21 రోజుల పాటు కొనసాగుతుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగుతుంది. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకూ జరిగే ఈ బస్సు యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఉదయం పూట ఇంటరాక్షన్, మధ్యాహ్నం, సాయంత్రం భారీ బహిరంగ సభల్లో జగన్ ప్రసంగిస్తారు.
తొలి రోజు బుధవారం (27వ తేదీ) సీఎం వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.
ఈ యాత్రలో భాగంగా బుధవారం సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు