YSRCP: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలకు భారీగా షాక్ లు ఇచ్చారు ఆ పార్టీల నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో ఆశావహులకు టికెట్ లు దక్కలేదు. దీంతో ఆయా పార్టీల్లో అసంతృప్తి నేతలు వలస బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు.
రాజంపేట మాజీ టీడీపీ ఇన్ చార్జి గంటా నరహరి మంగళవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చాలా కాలంగా టీడీపీ రాజంపేట ఇన్ చార్జిగా ఉన్న గంటా నరహరి ఈ నెల 13వ తేదీన జనసేన పార్టీలో చేరారు. అయితే రాజంపేట లోక్ సభ స్థానాన్ని టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని అభ్యర్ధిగా ఆ పార్టీ కేటాయించింది. అటు టీడీపీలో ఆ తర్వాత జనసేనలోనూ ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో జనసేన పార్టీకీ గుడ్ బై చెప్పారు గంటా నరహరి. ఇవేళ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరగా, ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిధున్ రెడ్డి, ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.
అలానే నూజివీడు మాజీ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత చిన్నం రామకోటయ్య కూడా వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పోరేటర్లు, జనసేన నాయకులు వైసీపీలో చేరారు. మాజీ కార్పోరేటర్ లు గండూరి మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ కోనూరు సుబ్రమణ్యం (మణి), మాజీ డివిజన్ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకుడు బత్తిన రాము తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, వైసీపీ అభ్యర్ధి కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ లు పాల్గొన్నారు.
అలానే విశాఖకు చెందిన సీనియర్ నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జీవి రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, జనసేన నాయకురాలు బొడ్డేటి అనురాధ లు జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమరనాథ్, విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కేకే రాజు పాల్గొన్నారు. అదే విధంగా సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కూడా వైసీపీలో చేరారు. సూళ్లూరుపేటకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరికి చెందిన మస్తాన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ అంగలూరి లక్ష్మీశివకుమారి, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు వైసీపీలో చేరారు.
Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ