YSRCP Internal; మండల, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.. టీడీపీ బహిష్కరించడం.., అక్కడక్కడా పోటీకి దిగినా ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ ఏకపక్ష విజయాలతో దూసుకెళ్లింది.. జనసేన అక్కడక్కడా ఉనికి చాటుకుంది..! ఈ ఎన్నికల ఫలితాలను లోతుగా గమనిస్తే వైసీపీలో కొందరు ప్రజాప్రతినిధులకు మూడినట్టే.. ఓటమిని ఏమాత్రం అంగీకరించని సీఎం జగన్.. తాను పూర్తిగా అధికార వనరులు సమకూర్చిన తర్వాత, టీడీపీ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తన పార్టీ ఓటమిని ఈ మాత్రం అంగీకరించరు. అందుకే రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెలిచినా 6 జెడ్పిటీసీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండబోతుంది..? అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి. పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి..!
రాష్ట్రం మొత్తం మీద 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైకాపా, 826 చోట్ల తెదేపా, 177 చోట్ల జనసేన, 28 చోట్ల భాజపా, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైసీపీ, 6 టీడీపీ, 2 జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలిచారు. అయితే, టీడీపీ తాము ఎన్నికలను బహిష్కరించామని..అందుకే వైసీపీ అన్ని స్థానాల్లో గెలిచిందని చెబుతోంది. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ నామినేషన్లు వేసింది, పోటీలోనే ఉంది అని గుర్తుచేస్తున్నారు. టీడీపీ పూర్తిగా బహిష్కరిస్తే ఈ మాత్రం గెలుపు ఎందుకు వస్తుంది..? 6 జెడ్పిటిసి, 826 ఎంపీటీసీలు ఎలా గెలుస్తుంది..? అంటూ అధికార పక్షం ప్రశ్నిస్తుంది. మొత్తానికి ఈ వివాదం ముదిరి పాకాన పడుతుంది. ఈ ఫలితాలు వైసీపీలో జోష్ పెంచితే..ఒక మంత్రి…ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం టెన్షన్ లో ఉన్నారు. జగన్ వీరిపై ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారోననే సందేహం మొదలయింది.
YSRCP Internal; ముందే సీరియస్ హెచ్చరికలు..!
స్థానిక సంస్థల నోటిఫికేషన్ రాకమునుపే సీఎం జగన్ ఈ ఎన్నికల విషయంలో మంత్రులు, జిల్లా ఇంచార్జిలు, ఎమ్మెల్యేలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా హెచ్చరికలు జరీ చేసారు. అందరూ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, ఎక్కడ ఓడినా బాధ్యత తీసుకోవాలని ముందే చెప్పారు. సో.., ఇప్పుడు ఎదురైనా ఓటమికి వారిని బాధ్యులుగా చేస్తే మాత్రం ఆరుగురు ఎమ్మెల్యేలకు సీటు గల్లంతయినట్టే.. 6 చోట్ల తెదేపా, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట జెడ్పీటీసీ స్థానాలు గెలిచారు.
* మంత్రి రంగనాధ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో ఆచంట స్థానం ఉంది. ఆచంట జెడ్పిటీసీ స్థానాన్ని టీడీపీ 2,253 ఓట్ల మెజార్టీ తో గెలిచింది. ఇక్కడ టీడీపీ – జనసేన పరస్పరం సహకరించుకున్నారనే వాదన వినిపిస్తోంది. కారణం ఏదయినా ఓటమి, ఓటమే..! మంత్రి బాధ్యత వహిస్తారా..లేదా అనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది.
* మరోవైపు విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేత, ఇటీవల వార్తల్లో ఉన్న అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో కూడ వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ పనితీరు బాలేదంటూ కొన్ని నెలలుగా వైసీపీ నేతలే అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. అందుకే కొన్ని నెలల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఆ ఓటమి, ఈ ఓటమి స్థానిక ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో సీటుకి ఎసరు పెట్టనున్నాయనేది పరిశీలకుల మాట.
* కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మోపిదేవి జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. వైసీపీ తరపున సింహాద్రి రమేశ్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పనితీరుపై ఇది రిఫరెండం గా చెప్తున్నారు.
* తూర్పు గోదావరి జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలు వైసీపీ కోల్పోయింది. ఒకటి రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని వర రామచంద్రాపురం. ఇంకోటి రాజమండ్రి రూరల్ పరిధిలోని జెడ్పిటిసీ స్థానం. పశ్చిమ గోదావరిలో మరో స్థానం వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం జెడ్పీటీసీని సైతం వైసీపీ కోల్పోయింది. సీఎం సొంత జిల్లాలో కూడ వైసీపీకి షాక్ తప్పలేదు. బద్వేలు అసెంబ్లీ పరిధిలోని గోపవరం జెడ్పీటీసీని టీడీపీ అభ్యర్ధి కలువాయి జయరామి రెడ్డి 104 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు.
నాడు వైస్ ఏం చేసారంటే..!?
ఇప్పుడు ఈ ఓటమిపై సీఎం జగన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు..? అనే కొత్త అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా.., 2006లో జరిగిన ఎన్నికల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని సొంత మండలాల్లో అధికార కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో సీఎం వైఎస్ ముగ్గురు మంత్రులను తొలగించారు. పశ్చిమగోదావరి జిల్లా నుండి మాగంటి బాబు, కర్నూలు జిల్లా నుండి మారెప్ప, అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి తదితరులు నాడు మంత్రి పదవులు కోల్పోయారు. అప్పట్లో ఈ నిర్ణయం పెద్ద రాజకీయ కుదుపు. ఈ నిర్ణయం తర్వాత మాగంటి బాబు టీడీపీలో చేరారు. మారెప్ప రాజకీయంగా సైలెంట్ అయ్యారు. సో.. తండ్రి వారసత్వాన్ని అందుకుంటున్న జగన్ కూడా అదే తీరున వ్యవహరిస్తే ముందుగా ఊడేది శ్రీరంగనాధరాజు పదవే..!