YSRCP : భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్-జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. భీమవరం ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించినట్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అని.. అతని అనుచరులు ఆకు రౌడీలంటూ కామెంట్ చేశారు. పవన్ ఒక మానసిక రోగి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తనను పిచ్చికుక్కల వ్యాన్లో వేసి పంపుతానన్న పవన్ వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు అదేవ్యాన్లో మిమ్మల్ని పంపారంటూ రివర్స్ ఎటాక్ చేశారు. తాను బ్యాంకును దోచేస్తే ఆ విషయం రుజువు చేయాలని సవాల్ విసిరారు. జనసేన నేతలు తలలు నరికితే నరికించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరంటూ గ్రంథి శ్రీనివాస్ అన్నారు.
వివాదం మొదలైంది ఇలా!
ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. వీరవాసరం మండలం మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారన్నారు. జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడి జరిగిందని తెలిసి వెళ్లిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎక్కువ చేస్తే మెడ మీద తలకాయలు ఉండవ్ అని హెచ్చరించారు. వాళ్ళ కార్యకర్తలకు దిశా నిర్దేశం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతో ఛలో మత్స్యపురికి పిలుపునిస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. దీంతో పవన్ కల్యాణ్ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ రియాక్షన్!
భీమవరం వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న శ్రీనివాస్.. ఓ ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని… ఆయన నుంచి ఇంతకంటే ఎక్కువ ఏమి ఆశిస్తామని పవన్ అన్నారు. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని… దాడులు చేస్తే చూస్తూ కూర్చోమని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేసిన పవన్..వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు. లేదంటే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేంత సంయమనం తమ దగ్గర లేదన్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా బనాయిస్తే… మానవహక్కుల సంఘానికి తాను స్వయంగ వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. దళితులను రక్షించాల్సిన చట్టాన్నే దళితులపై ప్రయోగిస్తున్నారన్నారు.వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్న… వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాటలను… జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు. ‘‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి… కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది… అప్పటి వరకు సంయమనం పాటించండి’’ అని పవన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఈ నేపధ్యంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మళ్ళీ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు.జనసేనాని ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.