అమరావతి: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆదివారం గుంటూరు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం లాడ్జి సెంటర్లోని డా. బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కేవలం రూ. 600 కోట్లకే హాయ్ ల్యాండ్ ఆస్తులను విక్రయించాలని చూడటం దారుణమన్నారు. బహిరంగ మార్కెట్లో రూ. 1800 కోట్లకు పైగా అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ వుంటుందని ఆయన చెప్పారు. అధికారంలోకి వస్తే బాధితులకు ఎంత మేర చెల్లించేది ఎన్నికల మేనిఫేస్టోలో పెడతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అగ్రిగోల్డ్ బాధితులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు.