హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై వైసిపి నేతలు విమర్శలు గుప్పించారు. వైసిపి నేతలు లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు మగళవారం మీడియాతో మాట్లాడారు.
లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోయిందనీ, ఆయన చంద్రబాబు మనిషేనని స్పష్టమైందనీ లక్ష్మీ పార్వతి అన్నారు. ఆయన టిడిపి మనిషని తమ పార్టీ ఎప్పటినుంచో చెబుతుందనీ, ఆయన పార్టీలో చేరుతున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో రావటంతో ఈ విషయంపై స్పష్టత వచ్చిందనీ లక్ష్మీ పార్వతి అన్నారు.
రాజకీయ కుట్రతోనే చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై అన్యాయంగా జగన్ పై కేసులు పెట్టారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. సిబిఐ జేడీగా భాద్యతగా ఉండాల్సిన వ్యక్తి టిడిపి అనుకూల మీడియాతో చేతులు కలిపి కేసుపై లీకులిస్తూ జగన్పై అసత్య ఆరోపణలకు కారణమయ్యారని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఈ కేసుతో అసత్యలను సృష్టించి అనుకూల మీడియాతో ప్రచారానికి వాడుకున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు.
లక్ష్మీ నారాయణ టిడిపి తరఫున భీమిలీ నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో వచ్చిందనీ, దీంతో చంద్రబాబు, జేడీల కుట్ర బయటపడిందని అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబు, లక్ష్మీనారాయణ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలపై విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు.
లక్ష్మీనారాయణ అక్కడ ఐజీగా ఉంటూ ఇక్కడ విచారణ జరిపారనీ, లోటస్ పాండ్లో అణువణువు వెతికి ఇక్కడ అనేక గదులు, లగ్జరీ సౌకర్యాలున్నాయని అసత్య ప్రచారం చేశారని అంబటి అన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది జేడి చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వేళ వీరిద్దరి బండారం బయటపడిందని ఆయన అన్నారు.
జేడీని హీరో చేసింది చంద్రబాబే అని అంబటి అన్నారు. జగన్ను అణగదొక్కేందుకు జేడీని సీన్లోకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.