గత కొద్ది రోజులుగా జరుగుతన్న ప్రచారమే మళ్లీ తెరమీదకు వచ్చింది. మరో ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరనున్నట్లు చెప్తున్నారు. అయితే, ఈ దఫా ఇందుకు కారణం అధికార వైసీపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న అభివృద్ధి కాదట.
ప్రతిపక్ష తెలుగుదేశంలో ఉన్న రాజకీయాలు అంటున్నారు. ఇంతకీ ఈ హాట్ టాపిక్కు వేదిక ఎక్కడ అనుకుంటున్నారా? రాజమండ్రి.
రాజమండ్రిలో రంజుగా రాజకీయం
గత కొద్దికాలంగా, రాజమండ్రి కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో రాజకీయం రంజుగా సాగుతోందని టాక్ వస్తోంది. దీనికి కారణం, టీడీపీ ముఖ్య నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరో సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. అర్బన్ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు. ఇద్దరూ కలసి కట్టుగా పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. కానీ తనకు దశాబ్దాలుగా పట్టున్న అర్బన్ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నిస్తున్నారు. అర్బన్ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో సహజంగా ఆదిరెడ్డి కుటుంబం హర్టవుతోంది. అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆదిరెడ్డి కుటుంబం ఆగ్రహంగా ఉందంటున్నారు. అధినాయకత్వం తనను ప్రశ్నించలేదన్న ధీమాతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన దూకుడు కొనసాగిస్తున్నారని సమాచారం.
ఆదిరెడ్డి ఫ్యామిలీకి బీపీ పెంచడమే
ఇప్పటికే స్థానిక రాజకీయాలతో సతమతం అవుతున్న ఆదిరెడ్డి ఫ్యామిలీకి షాకిచ్చేలా టీడీపీ రాజకీయాలు మారుతున్నాయని అంటున్నారు. అదే టీడీపీ పోలిట్బ్యూరోలోకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంట్రీ. పొలిట్ బ్యూరోలో మార్పుతు జరగనున్నాయని, మాజీ మంత్రి గల్లా అరుణ స్థానంలో పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరికి చాన్స్ ఇవ్వనున్నారని అంచనా వేస్తున్నారు.
గోరంట్ల బుచ్చయ్యకు భలే అనుకూలిస్తోందిగా
గోరంట్లకు పదవి దక్కడానికి అనేక అంశాలున్నాయని అంటున్నారు. మొదటిది పార్టీ కోసం కష్టపడటం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారిలో యనమల, అశోక్గజపతిరాజు, కేఈ, అయ్యన్నపాత్రుడు పొలిట్బ్యూరోలో ఉన్నందున అంతటి సీనియర్ అయిన బుచ్చయ్యకు చాన్స్ పక్కా అంటున్నారు. ఇక కీలకమైన కమ్మ సామాజికవర్గం లెక్కలు కూడా ఉన్నాయి. ఈ కోటాలో పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు వినిపిస్తున్నప్పటికీ, సీనియారిటీని లెక్కలోకి తీసుకొని బుచ్చయ్యను ఎంపిక చేస్తారని కొందరు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బుచ్చయ్య హవా పెరిగిపోయిందని ఆదిరెడ్డి ఫ్యామిలీ అధికార వైసీపీలోకి వెల్లిపోయే చాన్సుందని, అప్పుడు మరో ఎమ్మెల్యేను టీడీపీ కోల్పోవాల్సి వస్తుందనీ… గుసగుసలు వినిపిస్తున్నాయి.