గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినా..156 లక్షల ఓట్లు సాధించుకున్నా.. 48.5శాతం ఓటర్లను ఆకట్టుకున్నా.. జగన్మోహన రెడ్డి లక్ష్యం మొత్తం సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉండటమే. అంటే ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు పాదయాత్ర సమయం లోనూ.. చాలా సందర్భాల్లో ఆయన ఒక్క అవకాశం ఇవ్వండి.. 30 ఏళ్లు గుర్తుంచుకునే పరిపాలన చేస్తాను. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటుండే వారు. అయన లక్ష్యం నెరవేరాలంటే పరిపాలనతో పాటు రాజకీయంగానూ తన లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. పరిపాలనలో భాగంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అయన రాజకీయ లోపాలను ఎలా సరిదిద్దుకుంటున్నారు? రాజకీయంగా ఎలా బలపడుతున్నారు? అన్నదే కీలకంగా మారింది.
ప్రత్యర్థుల టార్గెట్ విచిత్రంగా..!
తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. బాగా పేరున్న నాయకులు ఉన్నారు. కొంత మందికి పెద్దగా పేర్లు లేనప్పటికీ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అటువంటి నాయకులను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తన దారిలో ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని, తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిని వారి లోపాలు, గత ప్రభుత్వంలో వారు చేసిన పాపాలను వెతికి, అటు ఇటు కాకుండా సైలెంట్ గా ఉన్న వారిని కూడా తన పార్టీకి ఉపయోగపడితే దారిలోకి తెచ్చుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని భావించవచ్చు. దీనిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒ మాజీ మంత్రిని వైసీపీలో చేరాలని పార్టీ నాయకుల నుంచి కబురు వెళ్లినట్టు తెలిసింది. అయన వైఎస్ కు, కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు..ముగ్గురికి అత్యంత ఆప్తుడు. మూడు సార్లు మంత్రిగా చేసిన పితాని సత్యనారాయణ. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు. ఆచంట నియోజకవర్గంలో మూడు సార్లు గెలుపొందారు. వైసీపీ గాలిలో కూడా ఓడిపోయినప్పటికీ మంచి ఓట్లనే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో ఆ సామజిక వర్గంలో పార్టీకి ఉన్న వెలితిని తీర్చుకోవాలంటే పితాని సత్యనారాయణను వైసీపీలో జాయిన్ చేసుకోవాలని ఆ జిల్లా పార్టీ పెద్దల నుంచి జగన్ కు సమాచారం అందిందట. అందుకే ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ద్వారా పితాని సత్యనారాయణకు గత నెల లోనే కబురు పెట్టారు. ఆయన నుంచి ఏమి స్పందన లేకపోవడంతో పార్టీ వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్యనారాయణ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన కంటూ కొన్ని కండిషన్ లు పెట్టుకుని ముందుకు వచ్చారని ఆ జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన నాయకులు ఎవరూ చేజారకుండా చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమయ్యారు. గత నెలలోనే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టిడిపిని వీడతారని ప్రచారం జరగడంతో ఆయనతో సంప్రదింపులు జరిపి బుజ్జగించి పార్టీలో ఉండేట్లు చేసుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విషయంలోనూ అదే జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మంచి పట్టున్న ఎటువంటి వివాదాలు లేని అవినీతి మరకలు లేని పితాని సత్యనారాయణను కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగితే రాజకీయంగానూ లభిస్తుందని భావించిన చంద్రబాబు పితాని సత్యనారాయణతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిసింది. అయితే పితాని మాత్రం పార్టీ మార్పుపైన, తన రాజకీయ భవిష్యత్తు పైన ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తనను కలిసిన కొంత మంది మీడియా వాళ్లతో కూడా తెలుగుదేశం పార్టీని వీడుతానని మీకు ఎవరు చెప్పారు? వైసీపీ నుంచి నాకు నాకు ఆహ్వానం ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు? అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రస్తుతానికి పార్టీని వీడే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు. కానీ నియోజకవర్గంలో అనుచరులతో మాత్రం రహస్య మంతనాలు జరుపుతున్నట్లు, వైసీపీ పెద్దలతో మాట్లాడుతున్నట్టు మాత్రం జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు వాస్తవం అనేది కొద్ది కాలంలోనే తేలిపోనుంది.