Ashok Gajapathi Raju: టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అక్రమాలపై ఒక్కోటీ విప్పుతూ… చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు మరో నాయకుడిపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరో రాజుని అరెస్టు చేయడానికి సిద్ధమవుతోందా..!? ఆయుధాలు, అస్త్రాలన్నీ రెడీ చేసుకుంటుందా..!? రఘురామకృష్ణంరాజుని అరెస్టు చేసి.. సరిగ్గా డీల్ చేయలేకపోయినా ప్రభుత్వం ఈ రాజు విషయంలో మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటుందా..!? రెండు వారాలు కిందట ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు విశాఖ వేదికగా జరుగుతున్న కొన్ని విచారణలు, పరిణామాలు, నివేదికలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. టీడీపీ కీలక నాయకుడు, అశోక్ గజపతిరాజుని అరెస్టు చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టే చెప్పుకోవచ్చు..
Ashok Gajapathi Raju: రెండు వారాలుగా పరిణామాలన్నీ ఓ సారి చూస్తే…!
జూన్ 14 న కోర్టు తీర్పు… సంచయిత నియామకం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత రోజునే “అశోక్ గజపతిరాజు ఒక దొంగ … దొడ్డి దారిన మళ్లీ సింహాచలం దేవస్థాన చైర్మన్ అయ్యారు. మళ్లీ అతి త్వరలో చైర్మన్ కుర్చీనుంచి తప్పకుండా దించేస్తాం” అంటూ వైసీపీ కీలక నేత విజయసాయి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రోజునే అశోక్ గజపతి రాజు మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా.., సింహాచలం ఆయన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కానీ జూన్ 24 నుండి ప్రభుత్వం ప్రణాళికలు కదిపింది.. జూన్ 25 నుండి 30 వరకు గుట్టు చప్పుడు కాకుండా అధికారుల విచారణ… 748 ఎకరాల భూమిని రికార్డుల నుండి తొలగించారని ప్రాథమిక నిర్ధారణ జరిగింది. దీనికి బలమైన రంగు పూయడానికి సాక్షిలో వరుసగా కథనాలు ప్రచురణ… ఆపై జూన్ 30 న ఇద్దరు జేసీలకు విచారణ బాధ్యతలు అప్పగించి ప్రాధమిక నివేదిక సిద్ధం చేశారు. అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్నప్పుడే భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నివేదిక..!? దీనికి పర్యవసానంగా “బాధ్యులను వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ జూన్ 30 న మంత్రి అవంతి, ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి భూ అక్రమాలు చేశారనే అభియోగంపై అరెస్టుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం…
కానీ కొన్ని చిక్కులున్నాయి సుమీ..!
భూ అక్రమాలను నిగ్గు తేల్చడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే వాటిలో అశోక్ గజపతిరాజు పాత్రని నిర్ధారించడమే ముఖ్యమైన పని. “ఆ భూములను అశోక్ గజపతి రాజు ఎవరికైనా ఇవ్వమని ఒత్తిడి చేసారా..? చైర్మన్ గా తన అధికారాలను వాడుకుని సిఫార్సు చేశారా..!? అనేది తేల్చాల్సి ఉంటుంది. అశోక్ గజపతిరాజు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే మళ్ళీ కోర్టు తల నొప్పులు తప్పవు. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు అరెస్టు.. మన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలతో క్షత్రియ సామాజికవర్గంలో వైసీపీ అంటే ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. దీనికి వైసిపిలో క్షత్రియ వర్గం కూడా కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ… రాజకీయంగా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ.. ఇచ్చే చేయిగా పేరొందిన క్షత్రియ సామాజికవర్గంలో ఇప్పుడు జగన్ అండ్ కో వ్యవహారశైలి పైనే భిన్నమైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఒకవేళ అశోక్ గజపతి అరెస్టు చేయడం ఖాయమే అయితే ఈ పర్యవసానాలు చాలా దూరమే వెళ్లేలా ఉన్నాయి.